కేసీఆర్ మాయల మాటకారి, మోసగాడు: విజయశాంతి ఫైర్
టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంగనర్ లో పర్యటిస్తున్న ఆమె మహిళలు విద్యార్థులతో సమావేశమయ్యారు. తెలంగాణకు మంచి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాములమ్మ తెలిపారు.
కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంగనర్ లో పర్యటిస్తున్న ఆమె మహిళలు విద్యార్థులతో సమావేశమయ్యారు. తెలంగాణకు మంచి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాములమ్మ తెలిపారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ఈసారి అలాంటి తప్పు చేయోద్దంటూ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కేసీఆర్ కు ఓటేస్తే ఆయన పాలనను గాలికొదిలేశారన్నారు. సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ హౌజ్ లోనో లేక ప్రగతి భవన్ కే పరిమితమవతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చెయ్యడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలకు సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తుందని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కేసీఆర్ లా అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి మోసం చెయ్యనని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి ఉన్నారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తుందని విజయశాంతి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ ఉంటుందని ఒక భరోసా ఉండేలా పాలన ఉంటుందని తెలిపారు. మహిళలే హోం మినిస్టర్ లు అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు.