తెలంగాణ బడ్జెట్... రుణమాఫీ పై కేసీఆర్ ప్రకటన
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణ మాఫీ పై కేసీఆర్ ప్రకటన చేశారు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణ మాఫీ పై కేసీఆర్ ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయాన్ని కేసీఆర్ ఈరోజు ప్రస్తావించారు.
రైతుల రుణమాఫీ అంశంలో ఇప్పటి వరకు ఏ తేదీని కటాఫ్గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. తాజాగా రైతు రుణాలు మాఫీపై బడ్జెట్లో సీఎం రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా రుణమాఫీ చేయనున్నారు.
అంతేకాకుండా.. ఈ బడ్జెట్ లో కేసీఆర్ రైతులకు పెద్ద పీట వేశారు. రైతు బంధు పథకానికి రూ.1200కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.22,500కోట్లు, వ్యవసాయానికి రూ.20,107కోట్లు, పంట కాలనీల అభివృద్ధికి రూ.20,107కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.