హేమాహేమీల ప్రచారం: 'జాతీయ మలుపు' తెలంగాణతోనే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దీంతో జాతీయ రాజకీయ పార్టీలన్నీ కూడ ఈ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి.
బీజేపీయేతర పార్టీలను కూడగడుతున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.దీంతో ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసింది. తెలంగాణలో ఏపీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి.
గత ఎన్నికలకు ఈ దఫా ఎన్నికల నాటికి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.
దేశంలో బీజేపీయేతర పార్టీలను కూడ గట్టేందుకు టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. బీజేపీయేతర పార్టీలతో వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబునాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు చేస్తామని మమత బెనర్జీతో పాటు దేవేగౌడతో చర్చించారు. ప్రస్తుతం వీరంతా కూడ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఫ్రంట్ కిందకు వచ్చేందుకు సిద్దమయ్యారు. దేవేగౌడతో పాటు మమత బెనర్జీ కూడ బాబుతో సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు తమ సంసిద్దతను వ్యక్తం చేశారు.ఈ నెల 10వ తేదీన బీజేపీయేతర పార్టీల కూటమి సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకుగాను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ చీఫ్ రాహుల్ గాంధీ గత మాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటు విషయమై చర్చించారు.
రాహుల్గాంధీ చంద్రబాబునాయుడు సమావేశం కావడానికి ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీతో జత కలుస్తామనే సంకేతాలను చంద్రబాబునాయుడు టీడీపీ నేతలకు ఇచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు భావించారు.అయితే టీఆర్ఎస్ మాత్రం టీడీపీతో పొత్తు వద్దని చెప్పేసింది.
జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఏపీతో పాటు తెలంగాణలో పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్తో చంద్రబాబునాయుడు కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు గాను పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించింది. టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు ఈ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడుపై పడింది. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఖమ్మం నుండి ప్రారంభించారు.
తెలంగాణలో టీడీపీ 13 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీడీపీ ఒక్క స్థానాన్ని కోల్పోయింది. కూటమి అభ్యర్థుల విజయం కోసం బాబు తెర వెనుక మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైతే రాజకీయంగా కాంగ్రెస్ తో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుకు కలిసి రానుంది. దేశంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రయత్నాలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో పాటు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో కూడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటర్లు తీర్పు ఇస్తే ఆ ఫలితాలు ఈ ఫ్రంట్కు మరింత ఊపునిస్తాయి.
ఒకవేళ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఆ ప్రభావం టీడీపీ, కాంగ్రెస్ లపై పడే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో టీడీపీని మరింత దెబ్బతీసేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణలో టీడీపీ ఈ ఎన్నికల్లో నిలదొక్కుకొంటే భవిష్యత్తులో తమకు ఇబ్బందే అభిప్రాయం టీఆర్ఎస్ నాయకత్వంలో ఉంది. దీంతో కేసీఆర్ టీడీపీని మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఛాన్స్ లేకపోలేదు.
రెండో సారి అధికారంలోకి టీఆర్ఎస్ వస్తే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఫ్రంట్ పేరుతో ఇతర పార్టీలను కూడగట్టే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబుకు ఏపీలో కూడ బాబు వ్యతిరేక శక్తులతో కేసీఆర్ చేతులు కలిపే అవకాశం కూడ కొట్టిపారేయలేం. ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, బీజేపీలతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ప్రజా కూటమి గెలుపు కాంగ్రెస్ పార్టీకి కూడ అనివార్యం. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో గెలవాలన్న కాంక్ష ఆ పార్టీలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ, సీపీఐ, టీజేఎస్లతో పొత్తు పెట్టుకొంది.
తెలంగాణలో బీజేపీ గెలిస్తే దక్షిణాదిలో కూడ తమ ప్రభావం ఉందనే చెప్పుకొనేందుకు ఈ రాష్ట్రాన్ని బీజేపీ నేతలు చూపే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే బీజేపీ నేతలు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ తర్వాత ఏపీ పై బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించనుంది.
ఇక ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని నేతలు బీఎస్పీ టికెట్లు పొంది ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. బీఎస్పీ అభ్యర్థుల తరపున మాయావతి కూడ ప్రచారం నిర్వహించారు. మాయావతి కూడ బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ లో చేరే అవకాశం లేకపోలేదు.మరోవైపు బీజేపీయేతర పార్టీల కూటమిలో సీపీఎం కీలక పాత్ర పోషించనుంది. అయితే తెలంగాణలో మాత్రం సీపీఎం బీఎల్ఎప్ పేరుతో పోటీ చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.2019 పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీల పునరేకీకరణ చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలన్నీ జాతీయ రాజకీయాల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూటముల ఏర్పాటుకు దారి తీసే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: అభ్యర్థుల్లో రెబెల్స్ వణుకు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఈ 12 సీట్లలో టగ్ ఆఫ్ వార్
ఆసక్తికరం: జనాభాలో తక్కువే, పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
వారసులు: తండ్రుల బాటలో ఆదిలాబాద్ నేతలు
నర్సంపేట: మద్దికాయల ఓంకార్ రికార్డ్ ఇదీ
ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే
కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు