గజ్వెల్ స్టోరీ: వంటేరుపై డీజిపికి విద్యార్థి నేత ఫిర్యాదు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షణ క్షణం ఏం జరుగుతోందో తెలియని ఉత్కంఠ నెలకొంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసే దశకు చేరుకుంటున్న తరుణంలో తాజాగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపాయి ఆయా పార్టీలు. ముఖ్యంగా గజ్వేల్, కొడంగల్, కూకట్ పల్లి నియోజకవర్గాలలో ఈ ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది.
గజ్వేల్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షణ క్షణం ఏం జరుగుతోందో తెలియని ఉత్కంఠ నెలకొంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసే దశకు చేరుకుంటున్న తరుణంలో తాజాగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపాయి ఆయా పార్టీలు. ముఖ్యంగా గజ్వేల్, కొడంగల్, కూకట్ పల్లి నియోజకవర్గాలలో ఈ ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది.
దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. మూడు నియోజకవర్గాల విషయానికి వస్తే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కాగా మరోకటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గం, మూడోది నందరమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గం . ఈ మూడు నియోజకవర్గాల పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది.
ఇకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి. అందుకు తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
ఇటీవలే పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ వంటేరు ప్రతాప్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ ఘటన మరువకముందే వంటేరు ప్రతాప్ రెడ్డిపై ఓ విద్యార్థి నేత డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ప్రతాప్ రెడ్డి తనపై ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి నేత సంజయ్ కుమార్ డీజీపీని ఆశ్రయించారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ తన ఫోన్లను పోలీసు శాఖ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తూ ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్కు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఒంటేరుపై ఓ విద్యార్థినేత సంజయ్ కుమార్ డీజీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే సీఎం కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రతాప్ రెడ్డి, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో కేసీఆర్ కేవలం 19వేల ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు వంటేరు.