అజ్ఞాతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగమేనా
తెలంగాణ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబొటిగా ఎమ్మెల్యేలను సాధించుకుని ఉనికి నిలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడడానికి సిద్దం కాగా అందుకు మరో ఎమ్మెల్యే కూడా సిద్దమయ్యాడని తాజాగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబొటిగా ఎమ్మెల్యేలను సాధించుకుని ఉనికి నిలుపుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల తర్వాత ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడడానికి సిద్దం కాగా అందుకు మరో ఎమ్మెల్యే కూడా సిద్దమయ్యాడని తాజాగా ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి). కాంగ్రెస్ హేమాహేమీలు సైతం ఓటమిపాలైన ఈ జిల్లాలో జగ్గారెడ్డి ఒక్కరే తన సత్తా చాటారు. అయితే ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీపై సాప్ట్ వైఖరిని కొనసాగిస్తున్నారు. పలు సందర్భాల్లో నియోజకవర్గ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలుస్తానని కూడా ప్రకటించారు.
అయితే జగ్గారెడ్డి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకే కాదు ఎప్పుడూ వెన్నంటి వుండే అనుచరులకు కూడా ఆయన దొరకడం లేదట. ఆయన అధికార కార్యకలాపాల కోసం ఉపయోగించే సెల్ ఫోన్ తో పాటు పర్సనల్ మొబైల్ కూడా స్విచ్చాప్ చేసివుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీంతో అతడు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు, అందుకోసం టీఆర్ఎస్ అధినాయత్వంతో మంతనాలు జరుపుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
అయితే కాంగ్రెస్ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని జగ్గారెడ్డి ప్రధాన అనుచరులు గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ ఖండించడంలేదు. దీంతో ఈ ప్రచారం నిజమయి వుంటుందని సంగారెడ్డి తో పాటు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.