డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి: 14న ఖమ్మం జిల్లా బంద్కు జేఎసీ పిలుపు
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో కార్మికులు తీవ్ర ఆవేదన చెందారు. ఆసుపత్రి వద్దే ఆందోళనకు దిగారు.
ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్కు ఈ నెల 14వ తేదీన ఆర్టీసీ జేఎసీ, విపక్షాలు పిలుపునిచ్చాయి.సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్ ప్రకటనకు నిరసనగా శ్రీనివాస్ రెడ్డి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు మృతి చెందాడు.
శ్రీనపివాస్ రెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకొన్న ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి, టీజేఎస్ ఛైర్మెన్ కోదండరామ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు ఢిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.
శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ కార్మికులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుజాగ్రత్తగా డిఆర్డిఓ అపోలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
మరో వైపు శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా ఈ నెల 14వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ కు రాజకీయ పార్టీలు, విపక్షాలు పిలుపునిచ్చాయి. శ్రీనివాస్ రెడ్డి మరణించిన విషయం తెలుసుకొన్న ఆర్టీసీ కార్మికులు జిల్లాలో పలు చోట్ల ఆందోళనకు దిగారు.
ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడకూడదని ఆర్టీసీ జేఎసీ నేతలు సూచించారు. తమ డిమాండ్లు సాధించేవరకు పోరాటం చేస్తామని జేఎసీ నేతలు కూడ ప్రకటించారు. రాజకీయపార్టీలు కూడ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని ప్రకటించాయి.