చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్ తో రేవంత్ రెడ్డి భేటీ: కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. చంచల్ గూడ జైల్లో ఆయన రవిప్రకాష్ తో భేటీ అయ్యారు.
హైదరాబాద్:ప్రశ్నించే వారిని సీఎం కేసీఆర్ అణగదొక్కుతున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియాపై కూడ సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆయన విమర్శించారు.
సోమవారం నాడు చంచల్గూడ జైలులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని రేవంత్ చెప్పారు. అంతేకాదు ప్రశ్నించిన వారి కుటుంబాలను మానసికంగా వెధింపులకు గురిచేస్తున్నారన్నారు.
"
ఇందులో భాగంగానే టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను వేధింపులకు గురిచేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సివిల్ తగదాలలో పోలీసుల జోక్యం ఎక్కువైందని , ఇలాంటి అక్రమ కేసుల గురించి జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.రవిప్రకాష్ కు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని ఆయన చెప్పారు.
ఎప్పుడు చంద్రశేఖర్ రావు ఒక్కడే ముఖ్యమంత్రి గా ఉండడనే విషయం అధికారులు గ్రహించాలని హితవు పలికారు. రెండురోజుల క్రితం రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్ ఉన్నారు.