Asianet News TeluguAsianet News Telugu

మరోసారి తెలంగాణపై విషం చిమ్మిన పయ్యావుల

  • ఎంపి కవిత, రేవంత్ కలిసి వ్యాపారాలు చేశారంటూ విమర్శలు
  • గతంలో తెలంగాణ ఇస్తే ఆత్మాహుతి దాడులు చేస్తామన్న కేశవ్
payyavula keshav once again unleashes anti telangana rhetoric

సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ మరోసారి తెలంగాణపై విషం చిమ్మిండు. ఉన్నవి లేనివి మాట్లాడి తెలంగాణ నేతలపై కొత్త అనుమానాలు కలిగేలా విమర్శలు గుప్పించిండు. గతంలోనే ఒకసారి తెలంగాణపై దారుణంగా మాట్లాడిన కేశవ్ మల్లా అదే నోటితో అదేరీతిలో మాట్లాడిండు. ఇంతకూ పయ్యావుల కేశవ్ ఏమన్నారో తెలియాలంటే... వివరాలివి.

గత పది రోజులుగా తెలంగాణ, ఎపి రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగుతున్నది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయిన నాటినుంచి ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ నేతలు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. ప్రాంతాలు లేవు, కులాలు లేవు, పార్టీలు లేవు. ఎవరు ఎవరి మీద విమర్శలు గుప్పిస్తున్నారో అంతుచిక్కకుండా వ్యవహారాలు నడుపుతున్నారు. సందుట్లో సడేమియా అన్నట్లు నేతలు చాటుమాటు వ్యాపారాలు సైతం ఈ సందర్భంగా బయటకు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డి ఎపి టిడిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. పయ్యావుల కేశవ్, పరిటాల కుటుంబం, యనమల రామకృష్ణుడు వంటి నేతలపై రేవంత్ కరుకు విమర్శలు చేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన పయ్యావుల కేశవ్ రేవంత్ మీద ప్రతి విమర్శలు చేస్తూ... రేవంత్ ఎప్పుడో చిన్నప్పటి వ్యాపారాలను, వ్యవహారాలను బయటపెట్టారు. సిఎం కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత తో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపారాలు చేయాలనుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. 

‘‘రేవంత్ రెడ్డి జడ్పీటిసిగా రాజకీయం మొదలుపెట్టిన నాడు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచారు. ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలిచాడు. మధ్యలో కొంతకాలం పాటు టిఆర్ఎస్ లో పనిచేశారు. ఆ సమయంలో టిఆర్ఎస్ నేతలతో రేవంత్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే ఎంపి కవిత తో కలిసి వ్యాపారం చేసిన దాఖలాలే లేవు’’ అని రేవంత్ సన్నిహితుడొకరు ఏషియా నెట్ కు చెప్పారు. ఎంపి కవిత తో కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు తప్ప వ్యాపారం చేయలేదని వివరించారు. దానికే పయ్యావుల కేశవ్ ఏదో బ్రహ్మపదార్థం కనిపెట్టినట్లు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు.

అయితే పయ్యావుల కేశవ్ ఉన్నఫలంగా ఎంపి కవితను వివాదంలోకి లాగడం పట్ల తెలంగాణ రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్లే ఉంది తప్ప పయ్యావుల కేశవ్ విమర్శల్లో పస లేదని తెలంగాణ నేతలు అంటున్నారు. గతంలోనూ పయ్యావుల కేశవ్ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని తెలంగాణవాదులు మరోసారి గుర్తు చేస్తున్నారు. ఎంపి కవిత విషయంలో పయ్యావుల కేశవ్ కేవలం దురుద్దేశపూర్వకంగానే విమర్శలు చేశారు తప్ప అందులో ఏమాత్రం పస లేదని మహబూబ్ నగర్ కు చెందిన టిఆర్ఎస్ నేత ఒకరు ఎద్దేవా చేశారు.

మొత్తానికి పయ్యావుల కేశవ్ తెలంగాణపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయడం తెలంగాణవాదుల్లో కలవరాన్ని కలిగించిందని చెప్పవచ్చు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీధర్ బాబు మీద పుట్టా మధు కుట్ర ... వీడియో కోసం చూడండి

https://goo.gl/8WE6wB

 

Follow Us:
Download App:
  • android
  • ios