''ప్రస్తుత ఒప్పందాలతో 66 వేల మందికి ఉద్యోగావకాశాలు''
- కేటిఆర్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీలు
- త్వరలోనే మరిన్ని కంపెనీలతో ఒప్పందాలు
- దేశంలోనే అగ్రగామిగా వరంగల్ టెక్స్ టైల్ పార్క్ తీర్చిదిద్దుతాం
వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న మెగా టెక్స్ టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నట్లు తెలంగాణ ఐటీ, చేనేత శాఖ మంత్రి కేటిఆర్ తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమల స్థాపన కోసం ఈ రోజు హోటల్ హరితలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ, చేనేత శాఖ మంత్రి కేటిఆర్ సమక్షంలో 14 కంపెనీల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 66 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పెట్టుబడి దారులకు కాకతీయ ఓరుగల్లు పట్టణ ప్రాశస్త్యాన్ని వివరించారు.ఇప్పటికే చరిత్రాత్మకంగా పేరుగాంచిన ఓరుగల్లు గడ్డపై మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు మరో చరిత్రగా మారనుందని ఆయన కొనియాడారు. ఈ పరిశ్రమలు టెక్స టైల్ పార్కులో 3020 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయని అన్నారు. ఈ పార్క్ ను ఒక హబ్ గా డెవలప్ చేయాలని ప్రభుత్వం బావిస్తున్నట్లు ఆయన వివరించారు. భారతదేశంలో నే తెలంగాణ టెక్స్ టైల్ పార్క్ అగ్రగామి గా నిలబెడతామని హామీ ఇచ్చారు.
దేశంలో వివిధ ప్రాంతాలలో తయారవుతున్న వివిధ రకాల వస్త్రాల ఇకపై వరంగల్ లోనే తయారవనున్నట్లు, దేశం వ్యాప్తంగా ఈ పార్క్ పేరు మారుమోగటం ఖాయమని మంత్రి కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.