ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆరో నిందితుడైన అతడి సోదరుడు శ్రవణ్కుమార్, ఐదో నిందితుడు కరీంలపై నిరుడు సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
మిర్యాలగూడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. భార్య అమృతతోపాటు ఆస్పత్రికి వెళ్లివస్తుండగా, ఆమె తండ్రి తిరునగరి మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు, ఆరో నిందితుడైన అతడి సోదరుడు శ్రవణ్కుమార్, ఐదో నిందితుడు కరీంలపై నిరుడు సెప్టెంబరు 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరు బెయిల్పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
మారుతీరావు, ఇతర నిందితులు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నారు. నిందితులు ఎప్పటికప్పుడు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు కౌంటర్లు వేస్తూ బెయిల్ రాకుండా చూస్తూ వచ్చారు.
పీడీ కేసులో మారుతీరావుతోపాటు శ్రవణ్, కరీం తాజాగా మరోసారి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కాపీలు వరంగల్ జైలు అధికారులకు చేరగానే ఆ ముగ్గురూ విడుదల అవుతారు.