మల్లు భట్టి విక్రమార్కకు సీఎల్పీ పదవి
సీఎల్పీ లీడర్ గా మల్లుభట్టి విక్రమార్కను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్: సీఎల్పీ లీడర్ గా మల్లుభట్టి విక్రమార్కను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎల్పీ నేత ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎల్పీ నేతగా నియామకం నిర్ణయాన్ని రాహుల్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ రాహుల్కు వివరించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మల్లుభట్టి విక్రమార్క పేరును సీఎల్పీ నేతగా నియమించినట్టు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అసెంబ్లీ వ్యవహరాల్లో అనుభవం ఉంది.ఈ పరిణామాల నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపింది.
పీసీసీ చీఫ్గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కొనసాగుతున్నారు.ఈ తరుణంలో సీఎల్పీ పదవి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది.