గోల్కొండ కోట వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ప్రేమికులిద్దరూ కోట ప్రధాన గేటు వద్ద నుంచి రామ్దేవ్గుడా వైపునకు పరుగెత్తారు. కోట వెనకవైపు అషూర్ఖానా సమీపంలో ఉన్న చీకటి ప్రాంతంలోకి వెళ్లారు.
ఇంట్లో తమ ప్రేమ గురించి తెలిసిపోయిందని.. ఓ ప్రేమ జంట గోల్కొండ కోట వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అదృష్టం బాగుండి ఇద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని గోల్కండ కోట వద్ద చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...యూసుఫ్గూడకు చెందిన శరత్(19), బంజారాహిల్్్స నందినగర్కు చెందిన యువతి(18) పాఠశాలలో చదివేప్పట్నుంచి స్నేహితులు. ప్రస్తుతం శరత్ ఎస్ఆర్నగర్లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, సదరు యువతీ ఇంటర్ మొదటి సంవత్సరమే. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ వ్యవహారం తెలిసి శరత్ చిన్నమ్మ శుక్రవారం మధ్యాహ్నం యువతి ఇంటికి వెళ్లి మందలించింది. ఆమె శరత్కు ఫోన్లో చెప్పడంతో ఇరువురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సాయంత్రం గోల్కొండ కోట వద్దకు చేరుకున్నారు. తాము ఆత్మహత్య చేసుకొంటున్నామని శరత్.. తన స్నేహితుడు మనీష్కు చెప్పడంతో అతను గోల్కొండకు చేరుకున్నాడు. వద్దని ఇరువురిని వారించాడు. ప్రేమికులిద్దరూ కోట ప్రధాన గేటు వద్ద నుంచి రామ్దేవ్గుడా వైపునకు పరుగెత్తారు. కోట వెనకవైపు అషూర్ఖానా సమీపంలో ఉన్న చీకటి ప్రాంతంలోకి వెళ్లారు. స్థానికులు గమనించి గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ భానుచందర్, మరో కానిస్టేబుల్, మనీష్ కలిసి అక్కడికి వెళ్లేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో కనిపించారు.
వెంటనే గోల్కొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చేతులకు స్వల్ప గాయాలున్నాయి. చేతులను కోసుకునేందుకు యత్నించడంతో గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తక్కువ ఎత్తులో నుంచి కిందకు దూకి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. పదో తరగతి నుంచి ప్రేమలో ఉన్నారని కుటుంబీకులు మందలించినా లెక్కచేయకుండా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.