పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్: అదే సెంటిమెంట్
పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. మార్చి 1వ తేదీ నుండి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. మార్చి 1వ తేదీ నుండి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుండే కేటీఆర్ ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కేంద్రీకరించింది.
హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తోందని టీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది. ఎంఐఎం విజయం సాధించినా కూడ తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున నష్టం లేదనే అభిప్రాయంతో గులాబీ నేతలు ఉన్నారు.
రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.
మార్చి 1వ తేదీ నుండి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లా నుండి కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.రాష్ట్రంలోని 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడ కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను విస్తృతంగా ఈ ఎన్నికల్లో ప్రజలకు వివరించనున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను కరీంనగర్ జిల్లా ప్రజలు అక్కున చేర్చుకొన్నారు. కేసీఆర్ కూడ ఎక్కువగా కరీంనగర్ నుండే ఎన్నికల ప్రచారాలను ప్రారంభించేవారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ కరీంనగర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్ నుండి ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా విజయవంతమైనందున ఈ సెంటిమెంట్ను గులాబీ నేతలు విశ్వసిస్తున్నారు.
కేంద్రంలో టీఆర్ఎస్ సూచించే ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం జరుగుతోందనే విషయమై టీఆర్ఎస్ నేతలు ప్రజలకు విరించనున్నారు.ఫెడరల్ ప్రంట్ ద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.