మండవ ఇంటికి కేసీఆర్: టీఆర్ఎస్లోకి ఆహ్వానం
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు వెళ్లారు. టీడీపీలో ఉన్న మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించనున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు వెళ్లారు. టీడీపీలో ఉన్న మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించనున్నారు.
చాలా కాలంగా మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ చేర్చుకోవాలని ఆ పార్టీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మండవ వెంకటేశ్వరరావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కేసీఆర్లు అత్యంత సన్నిహితులు.
ఏపీకి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. తెలంగాణకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం మండవ వెంకటేశ్వరరావు కోసం ఆ పార్టీ నాయకత్వం గాలం వేస్తోంది.
క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని మండవ వెంకటేశ్వరరావు చాలా కాలంగా భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన 2009 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించారు. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు పట్టుబట్టి మండవను ఎన్నికల్లో పోటీ చేయించారు.
ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో కూడ మండవ పోటీకి దూరంగానే ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ప్రస్తుతం 177 మంది రైతులు బరిలో ఉన్నారు. మండవ వెంకటేశ్వరరావు లాంటి నేతలు తమ పార్టీలోకి వస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.