చేవేళ్ల ఎంపీ సీటుపై కన్నేసిన స్వామి గౌడ్
టీఆర్ఎస్ ఆదేశిస్తే చేవేళ్ల నుండి తాను ఎంపీగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలంగాణ శాసనసమండలి చైర్మెన్ స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఆదేశిస్తే చేవేళ్ల నుండి తాను ఎంపీగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలంగాణ శాసనసమండలి చైర్మెన్ స్వామిగౌడ్ స్పష్టం చేశారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. తన కొడుకు రాజకీయాల్లోకి రాడని స్వామి గౌడ్ తేల్చి చెప్పారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో స్వామి గౌడ్ చేవేళ్ల నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడ పోటీకి సిద్దమనే సంకేతాలు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటును తనకు కేటాయించాలని స్వామిగౌడ్ కేసీఆర్ను కోరారు.
అయితే టీడీపీ నుండి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కే ఈ స్థానంలో మరోసారి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. ఈ స్థానం నుండి ప్రకాష్ గౌడ్ మరోసారి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఎంపీ స్థానానికి పోటీ చేయాలని స్వామి గౌడ్ భావిస్తున్నారు.అయితే చేవేళ్ల ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతోందో త్వరలోనే తేలనుంది.