ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టి... యువకుడు ఆత్మహత్య
ఇన్ స్టాగ్రామ్ లో చనిపోతున్నానని పోస్టు పెట్టి మరీ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఇన్ స్టాగ్రామ్ లో చనిపోతున్నానని పోస్టు పెట్టి మరీ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన ఆశీర్వాదం, నాగమణి దంపతుల కుమారుడు పవన్ ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాడు. అనంతరం ఇంజినీరింగ్ హైదరాబాద్ సీవీఎస్ ఆర్ కాలేజీలో చేర్పించారు.
అయితే... ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో పవన్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడిగి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. తాను చదువులో వెనకపడిపోతున్నానని బెంగ పెట్టుకున్నాడు.
గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనం పక్కన ఉన్న భవంతిపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తీవ్ర గాయాలు అయిన పవన్ కొద్దిసేపు బాగానే మాట్లాడాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొన్న అతడిని బతికించటాని వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకొన్న పవన్ ఇన్స్టాగ్రామ్లో ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్ఫుల్ లైఫ్’ .. అంటూ స్నేహితులకు మెసేజ్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ తన స్నేహితులకు కూడా అనుమానం కలగకుండా ఇంగ్లిష్లో లేఖ రాసుకుని జేబులో పెట్టుకొన్నాడు. ఆ లేఖలో తాను చదవలేకపోతున్నానని, తనను ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారని, తాను తన కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టి వెళుతున్నానని రాసుకున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.