Asianet News TeluguAsianet News Telugu

మారుతీరావు గత చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు: ప్రణయ్ భార్య అమృత

ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

Amrutha varshini questions Maruthi Rao supporters
Author
Miryalaguda, First Published May 2, 2019, 11:09 AM IST

మిర్యాలగూడ:  తన భర్త ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తన తండ్రి మారుతీరావును కొంత మంది సమర్థించడంపై అమృత వర్షిణి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మారుతీరావు గత చరిత్ర తెలియక మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. మారుతీరావును లెజెండ్ తదితర వ్యాఖ్యలతో సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. 

ప్రణయ్‌ హత్య కేసులో నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్‌ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

బుధవారం మిర్యాలగుడా ముత్తిరెడ్డికుంటలోని పేరుమళ్ల ప్రణయ్‌ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఆ తర్వాత ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పీడీ యాక్టు కేసులో బెయిల్‌పై విడుదల కావడం వల్ల బాధితులు అయిన అమృత వర్షిణి, బాలస్వామి, ప్రణయ్‌ కుమారుడు నిహాన్‌ ప్రణయ్‌లకు ప్రమాదం పొంచి ఉందని వారన్నారు.

మారుతిరావును ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసి న్యాయ విచారణ ప్రారంభించాలని కోరారు. నిందితులకు శిక్ష పడేందుకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా అన్నారు. 

నిందితులు విడుదల కావడంతో నేర విచారణ, న్యాయ విచారణలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని, బాధితులకు రక్షణ లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు నేరం నుంచి తప్పించుకోకుండా పోలీసులు వెంటనే చార్జీషీట్‌ను వేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఆలోచించాలని, నిందితులు కేవలం పీడీ యాక్టు కేసులో మాత్రమే బెయిల్‌పై వచ్చారని, హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు ఉందని గుర్తు చేశారు

ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఏ కేసు అయినా కూడా 90 రోజుల్లో చార్జిషీట్‌ను పోలీసులు వేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. అమృత విషయంలో సోషల్‌ మీడియాలో కొంత మంది ఆసభ్యకర పోస్టులు పెట్టుతున్నందున వారిపై చర్యలను తీసుకోవాలని కోరారు.  

తమప్రాణం ఉన్నంత వరకు నిందితులకు శిక్షపడేంత వరకు పోరాడుతామని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్తలు డాక్టర్‌ రాజు, శ్రీరాములు తదితరులున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios