పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్
గతేడాది ఇదే రోజున నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డ చెయ్యి పట్టుకునేందుకు ఎదురు చూస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల్లో గతేడాది కలకలం సృష్టించిన సంఘటనల్లో మిర్యాలగూడ పరువు హత్య ఒకటి. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే అక్కసుతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని దారుణంగా పట్టపగలే హత్య చేయించాడు. ఈ సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా.. నేడు ప్రణయ్- అమృతల మొదటి పెళ్లి రోజు.
సరిగ్గా సంవవత్సరం క్రితం ఇదే రోజున అమృత- ప్రణయ్ ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్దిరోజులు హైదరాబాద్ లోనే గడిపిన వీరు తర్వాత మిర్యాలగూడ వెళ్లారు. ప్రణయ్ హత్యగురయ్యే నాటికి అమృత ఐదు నెలల గర్భిణి. ఆస్పత్రిలో చెకప్ కోసం రాగా.. ప్రణయ్ ని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు.
కాగా.. తన పెళ్లిరోజుని పురస్కరించుకొని ‘ జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేజీలో ఒక సందేశాన్ని ఉంచింది అమృత. ‘‘ మన పెళ్లి అయ్యి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజున నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఇది త్వరలోనే నెరవేరబోతోంది. లవ్ యూ లల్లూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను’’ అంటూ పోస్టు పెట్టింది.
కాగా.. అమృత పెట్టిన పోస్టుకి నెటిజన్లు వేల సంఖ్యలో స్పందించారు. ధైర్యంగా ఉండాలంటూ అమృతకు మెసేజ్ ల ద్వారా తెలియజేస్తున్నారు.