ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దు:సిఈవో రజత్
ఏపీ సర్కార్ కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో వివరించారు.
హైదరాబాద్: ఏపీ సర్కార్ కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను మంగళవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రజత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు తుది ఓటర్ల జాబితా అందజేస్తామన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇస్తామన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల విషయంలో వ్యత్యాసం ఉందన్నారు. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చే అవకాశం ఉందన్నారు. 9445 సర్వీస్ ఓటర్లు ఉన్నారని ఓటర్ల నమోదు పెరిగిందని చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణకు 1,60,509 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 35 వేల మంది పోలీసులు, ఇతర రాష్ట్రాల నుంచి 18 వేల మంది పోలీసులు రానున్నట్లు చెప్పారు. 279 సీఆర్పీఎఫ్ బలగాలు విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 3583 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. 3500 కేసులు సీవిజిల్ కు వచ్చాయన్నారు.
ఎపిక్ కార్డులు పంపిణీ ప్రారంభం అయ్యిందన్నారు. మీ సేవలో 5 లక్షల కార్డులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. నెల చివరి వరకు ఓటర్ల అందరికి ఎపిక్ కార్డులు అందజేస్తామన్నారు..
ఎపిక్ బ్రెయిలి కార్డులను కూడా అందుబాటులో ఉంచినట్లు సిఈవో రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటామన్నారు. కేసులు లేని అభ్యర్థులు పత్రికలలో, మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటి వరకు 90.72 కోట్లు నగదు సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. 77.38 నగదు, 7కోట్లు 55 లక్షల విలువైన లిక్కర్, నగలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే సంగారెడ్డి కలెక్టర్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని మా పరిశీలనలో తేలిందని ఈ వ్యవహారంపై నివేదికను ఈసీఐకి సమర్పించామన్నారు. అలాగే ఈనెల 23న బ్యాలెట్ ప్రింటింగ్ చేపడతామన్నారు.
నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ నుంచే అభ్యర్థి ఖర్చు పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. హరీష్, రేవంత్, ఒంటేరు, రేవూరిలకు నోటీసులు ఇచ్చామని నోటీసులపై వాళ్ళు వివరణ ఇచ్చినట్లు తెలిపిన రజత్ తమ అభిప్రాయాన్ని ఈసీఐకి నివేదించినట్లు తెలిపారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒక మత సమావేశంలో మాట్లాడారని దానిపై నోటీసులు ఇవ్వగా వివరణ ఇచ్చినట్లు తెలిపారు. గంగుల కమలాకర్ పై ఎఫ్ఐఆర్ నమోదైందని దానిపై ఈసీఐకి నివేదిక ఇచ్చామన్నారు.
ఇకపోతే ప్రగతి భవన్ లో జరుగుతున్న రాజకీయ సమావేశాలపై పార్టీ ముఖ్యులకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. వాళ్లు కూడా వివరన ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దానిపై త్వరలోనే ఈసీఐకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల నుంచి ఆర్థిక శాఖ ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని మరికొందరికి జిల్లా ఎన్నికల అధికారులు కూడా మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉందని రజత్ కుమార్ తెలిపారు.