సహచరుల వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న బీహెచ్ఈఎల్ ఉద్యోగిని
తెలంగాణ రాష్ట్రంలో బీహెచ్ఈఎల్ ఉద్యోగిని నేహా గురువారం నాడు ఆత్మహత్య చేసుకొంది
హైదరాబాద్: హైద్రాబాద్ సమీపంలోని బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న 33 ఏళ్ల మహిళ తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీహెచ్ఈఎల్ లో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్న నేహా తన ఇంట్లోనే గురువారం నాడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఆత్మహత్యకు ముందు నేహా ఓ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్ ను రాసింది. ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాను పనిచేస్తున్న కార్యాలయంలో తనకంటే పై స్థాయి అధికారితో పాటు మరో ఆరుగురు తన తోటి ఉద్యోగులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
కొంత కాలంగా తనను వేధిస్తున్నారని ఈ విషయమై తాను భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బాధితురాలు ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది. నేహా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించనున్నారు.
తాను ఫోన్ చేస్తే తన భార్య ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయ లేదని ఇంటికి వచ్చి చూస్తే ఆమె ఆత్మహత్య చేసుకొందని నేహా భర్త మీడియాకు చెప్పారు. తన భార్య ఆత్మహత్యకు గల కారణాలను వెలికి తీయాలను నేహా భర్త పోలీసులను కోరారు.