డిల్లీలో కేసీఆర్ చక్రం కాదు.. బొంగరం కూడా తిప్పలేరు: లక్ష్మణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ పేరు చెప్పి డిల్లీలో చక్రం తిప్పుతానంటూ చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్తిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఆయన చక్రం కాదు కదా డిల్లీలో బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ పేరు చెప్పి డిల్లీలో చక్రం తిప్పుతానంటూ చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్తిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఆయన చక్రం కాదు కదా డిల్లీలో బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లోక్ సభ ప్రచారంలో ప్రసంగిస్తూ బిజెపితో పాటు ఆ పార్టీ కేంద్ర నాయకులపై చేసిన విమర్శలు ప్రజలు నవ్వుకునే విధంగా వున్నాయన్నారు. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత కేటీఆర్ ,కేసీఆర్ వ్యాఖ్యల్లో అహంకారం కనిపిస్తోందని...నిన్నటి మాటలు కూడా అందుకు నిదర్శనంగా నిలిచాయన్నారు.
రంగులు మార్చే ఊసరవెల్లి లాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే కేసీఆర్ నీతులు వల్లించడం ఆశ్యర్యంగా అనిపించిందన్నారు.
కేసీఆర్ తనకు తానే నెంబర్ వన్ అంటున్నారని....అసలు ఆయన ఎందులో నంబర్ వనో చెప్పాలన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రెండు లక్షల కోట్ల అప్పులు చేయడంలో... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేసీఆర్ నంబర్ వన్ అని అన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులు చేస్తున్నవారిని, అందుకు ప్రోత్సహిస్తున్న వారిని శీరి చింతకు కడతానని కేసీఆర్ అనేవారని... ఇప్పుడు ఆయన్ని ఎవరు చింతకు కట్టాలో చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రిగా గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు రాలేదని గుర్తు చేశారు. ఇలా ప్రగతిభవన్కు పరిమితం అయిన ఆయన ప్రధాని పై విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు.
తెలంగాణ తరహాలో దేశాన్ని తీర్చుదిద్దుతానంటున్న ఆయన ఎలా చేస్తారో కూడా చెప్పాలన్నారు. కేసీఆరే కేంద్రం అధికారాలన్నిటిని రాష్ట్రాలకు ఇవ్వాలని అంటున్నారని... అప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రయోజనమేంటని లక్ష్మణ్ ప్రశ్నించారు.
కేవలం యజ్ఞాలు చేసినంత మాత్రాన హిందువువి కాలేవని అన్నారు. ముందు అయోధ్య రామ మందిరం పై మీ పార్టీ వైరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ద్వంద వైఖరి, ద్వంద నీతి కలిగిన పార్టీ అని విమర్శించారు. గతంలో మజ్లీస్ ను ముష్టి పార్టీ అన్న ఆయనకు ఇప్పుడు అదే ఎందుకు ముద్దయిందో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు.