కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలో: రాహుల్ గాంధీ
బీజేపీ, టీఆర్ఎస్లు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.
జహీరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్లు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమవారం నాడు జహీరాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేస్తే మోడీకి, ఆర్ఎస్ఎస్కు ఓటేసినట్టుగా ఆయన చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి విషయంలో మోడీకి మద్దతుగా నిలుస్తాడని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ను రిమోట్ కంట్రోల్తో మోడీ నడుపుతున్నాడని మోడీ ఆరోపించారు. నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ మద్దతుగా నిలిచాడని చెప్పారు. మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేయడం లేదని ఆయన వివరించారు.
నాలుగున్నర ఏళ్ల క్రితం మోడీ చౌకీదారు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారన్నారు. నీరవ్ మోడీకి, అనిల్ అంబానీకి, విజయ్ మాల్యాకు చౌకీదారుడుగా మారాడని ఆయన ఆరోపించారు.
దేశాన్ని ముంచిన వారికి మోడీ సేవకుడిగా మారాడని ఆయన విమర్శించారు.మోడీ 15 మంది కోసమే పనిచేశారని ఆయన ఆరోపించారు. అబద్దపు హామీలను ఇచ్చారని చెప్పారు. 15 లక్షలను ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో వేస్తానని హామీ ఇచ్చారు. మరో వైపు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.
అబద్దాలు చెప్పడంలో మోడీ నెంబర్ వన్ అని రాహుల్ విమర్శించారు. దేశంలోని పేదలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేస్తోందని ఆయన ప్రకటించారు. పేదలకు ప్రతి నెల రూ. 12వేలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. ఏటా రూ. 72 వేలను ఇస్తామన్నారు. సుమారు ఐదు కోట్లకు పైగా పేదలకు తాము ఈ సహాయాన్ని ఇస్తామని రాహుల్ ప్రకటించారు.
నరేంద్ర మోడీ పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని రాహుల్ ఆరోపించారు. పేదలను ఇబ్బందులు పెట్టేలా పెద్ద నగదు నోట్ల రద్దు చేశారని ఆయన ఆరోపించారు.పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రం బ్యాంకుల వద్ద లైన్లలో నిల్చోలేదన్నారు. సామాన్యలు మాత్రమే బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడ్డారని రాహుల్ గుర్తు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడ రైతులకు న్యాయం చేయలేదన్నారు.