జూన్ వరకు అనిల్కు ఊరట! జియో- ఆర్ కామ్ డీల్ గడువు పొడిగింపు
అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి ఊరట లభించింది. రిలయన్స్ జియోకు స్పెక్ట్రం విక్రయంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్)తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు పొడిగిస్తున్నట్లు రెండు సంస్థలు ప్రకటించుకున్నాయి.
న్యూఢిల్లీ: వైర్లెస్ ఆస్తుల విక్రయానికి కుదుర్చుకున్న ఒప్పంద గడువును పొడిగించుకుంటున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కాం), రిలయన్స్ జియో ఇన్ఫో కమ్యూనికేషన్స్ (జియో) ప్రకటించాయి. ఆర్-కామ్ నుంచి స్పెక్ట్రం ఒప్పందం కొనుగోలుపై టెలికం శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఈ ఒప్పంద గడువు పొడిగించుకోవాలని ఇరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో ఒప్పందం గడువు పొడిగిస్తున్నట్లు తెలిపాయి.
‘రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కుదుర్చుకున్న ఆస్తుల కొనుగోలు ఒప్పంద కాలపరిమితిని 2019 జూన్ 28 వరకు ఆర్-జియో పొడిగించుకుంది’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించింది. ప్రభుత్వపరంగా అన్ని రకాల అనుమతులు, ఆమోదాలు, రుణదాతల అంగీకారం పొంది సదరు ఆస్తులపై ఉన్న చిక్కులన్నీ తీరాకే కొనుగోలు జరుగుతుందని తెలిపింది.
టవర్లు, ఫైబర్, ఎంసీఎన్, స్పెక్ట్రమ్ విక్రయం కోసం ఆర్-జియోతో కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నట్లు ఆర్-కామ్ సైతం విడిగా ప్రకటించింది. రిలయన్స్ జియోకు స్పెక్ట్రం విక్రయం కోసం తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేయాలని ఆర్-కామ్ చాలా రోజులుగా టెలికం శాఖను అభ్యర్థిస్తోంది. కానీ ఇరు కంపెనీల మధ్య ఈ డీల్కు సంబంధించిన చెల్లింపులపై టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది.
టెలికం శాఖ అభ్యంతరాలపై సమాధానమిచ్చేందుకు ఆర్ జియో, ఆర్-కాం ప్రతినిధులు గత నెలలో టెలికం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ విషయంలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్న టెలికం శాఖ డిమాండ్ను టెలికం ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు ఆర్-కామ్ గుర్తు చేసింది. బ్యాంకు గ్యారెంటీ బదులు తమ అనుబంధ సంస్థ ఆర్ రియల్టీ ద్వారా అవసరమైన కార్పొరేట్ గ్యారెంటీ ఇస్తామని, అందువల్ల అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం లేదని ఆర్కామ్ పేర్కొంది.
కానీ టెలికం శాఖ మాత్రం రిలయన్స్ జియో, ఆర్-కామ్ మధ్య కుదిరిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసేందుకు ఇంకా అంగీకరించలేదు. ముఖ్యంగా చెల్లింపుల బకాయిలు, ఇతర చార్జీలపై ఇంకా స్పష్టత రావాలని టెలికం శాఖ భావిస్తోంది. ముఖ్యంగా డీల్పై ఆర్-కామ్కు ఎలాంటి గ్యారెంటీ కూడా ఇవ్వటానికి జియో అంగీకరించకపోవడంతో టెలికం శాఖ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు కంపెనీలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించుకున్నాయి.