Asianet News TeluguAsianet News Telugu

ఇదీ ఫేస్‌బుక్ టార్గెట్: మూడేళ్లలో 50 లక్షల మందికి ‘డిజిటల్’ శిక్షణ

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ దేశంలో 50 లక్షల మందికి డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది

Facebook Plans To Train 5 Million Indians In Digital Skills By 2021
Author
New Delhi, First Published Nov 25, 2018, 10:43 AM IST

న్యూడిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ దేశంలో 50 లక్షల మందికి డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో  నైపుణ్యాలు మెరుగు  పరుచుకుని బిజినెస్‌ చేసేలా శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ప్రతినిథి అంఖి దాస్‌ తెలిపారు. తమ మార్కెట్‌ షేర్‌ ఇండియాలో ఎక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ పూర్తి చేశామన్నారు.

‘చిన్న స్థాయి బిజినెస్‌లను అంతర్జాతీయ స్థాయి ఎకానమీ తాకేలా మార్చడానికి ఫేస్‌బుక్‌ కట్టుబడి ఉంది. దీనికై పలు సంస్థలతో కలసి ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 2021 ​కల్లా 5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.’ అని ఫేస్‌బుక్ దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ప్రతినిథి అంఖి దాస్‌ తెలిపారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలతో దేశీయ చిన్న వ్యాపారాలను  ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ఈ శిక్షణ ఉపయోగపడనుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఈ శిక్షణను నిర్వహిస్తామని  ఆమె చెప్పారు.

‘50 మంది  భాగస్వాములతో కలిసి సుమారు 150  నగరాలు, 48వేల గ్రామాలలో పది సంస్థల ద్వారా 10 లక్షలమం‍దికి శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉంటే కలిగే లాభాలను ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలనుకుంటున్నాం. కొత్తగా సంస్థలు ప్రారంభించే వారికి ఈ ట్రైనింగ్‌ ద్వారా బిజినెస్‌లో ఎదిగేలా చేయాలనేది మా కల’ అని ఫేస్‌బుక్ దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ప్రతినిథి అంఖి దాస్‌ అన్నారు.  ఈ శిక్షణను విస్తృతం చేసేందుకు ఫేస్‌బుక్‌ 14 స్థానిక భాషల్లో విధివిధానాలను రూపొందించిందని, ఈ పద్దతిని ఇండియాలోని 29 రాష్ట్రాల్లో ప్రారంభించామని తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్ర లాంటి  రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. నైపుణ్యాభివ్రుద్ధి, పారిశ్రామిక రంగంలో డిజిటల్ శిక్షణపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. 

ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ అవుతున్న విద్వేషపూరిత వీడియోలు, అసాంఘిక పోస్ట్‌లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఇప్పటివరకూ 150 కోట్ల పోస్ట్‌లను ఫేస్‌బుక్‌ తొలగించిందని, ఇలాంటి వాటిని ఫేస్‌బుక్‌ సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. తమ పాలసీకి భిన్నంగా ఉన్న పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పొలిటికల్‌ యాడ్స్‌ గురించిన డెవలప్‌మెంట్‌ జరుగుతోందని తెలిపారు. 2019 ఎన్నికల్లోపు ఆ ఫీచర్‌ తీసుకొస్తామని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్‌ ఆలన్‌ అక్టోబర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios