అంతా అనుకున్నట్లే.. బీఎస్ఎన్ఎల్లో 80 వేల మందికి వీఆర్ఎస్
ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునర్వ్యవస్థీకరణ పేరిట రెండు సంస్థల్లోనూ ఆకర్షణీయ వీఆర్ఎస్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. బీఎస్ఎన్ఎల్ సంస్థలో 70-80 వేల మంది ఈ ప్యాకేజీ పరిధిలోకి వస్తారని, తద్వారా సంస్థపై రూ.7 వేల కోట్లు వేతన భారం తగ్గనున్నదని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రకటించింది. సోమవారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ వీఆర్ఎస్.. వచ్చే నెల 3దాకా కొనసాగుతుందని సంస్థ సీఎండీ పీకే పుర్వార్ పీటీఐకి తెలిపారు. 70- 80 వేల మంది వరకు ఈ వీఆర్ఎస్ పథకానికి అర్హులవుతారని చెప్పారు. అన్ని యూనిట్లకు వీఆర్ఎస్ సమాచారాన్ని అందజేశామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీఆర్ఎస్ విజయవంతమైతే సంస్థకు వేతనాల చెల్లింపుల్లో దాదాపు రూ.7 వేల కోట్లు ఆదా కానున్నాయి. ఉద్యోగులకు అత్యుత్తమ రీతిలో వీఆర్ఎస్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
also read వాట్సాప్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్లో కొత్త ఫీచర్
దీన్ని అందరూ మంచి దృష్టితో చూడాలి అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్ అన్నారు. రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు, డిప్యుటేషన్పై ఇతర సంస్థలకు లేదా డిప్యుటేషన్ ఆధారంగా బీఎస్ఎన్ఎల్ వెలుపల పోస్టింగైనవారిలో 50 ఏండ్లు పైబడిన వారందరూ వీఆర్ఎస్ను ఎంచుకోవచ్చని ఆయన సూచించారు.
ఇక వీఆర్ఎస్ పరిధిలో ఉన్న ఏ ఉద్యోగికైనా గడిచిన ప్రతీ ఏడాదికి 35 రోజులకు సమాన జీతం, పదవీ విరమణ వరకు మిగిలిన సర్వీసులో ప్రతీ సంవత్సరానికి 25 రోజుల వేతనం చొప్పున పరిహారం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్ వివరించారు.
ఇక మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) సైతం సోమవారమే వీఆర్ఎస్ను అమల్లోకి తీసుకువచ్చారు. అదీ కూడా వచ్చే నెల 3దాకా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ సీఎండీ సునీల్ కుమార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
aslo read అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్, సిరిని 'లైట్' సిగ్నల్స్ తో హ్యాక్ చేయవచ్చు.....
గుజరాత్ మోడల్ వీఆర్ఎస్ ఆధారంగా ఈ పథకాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి 50 ఏళ్లు, ఆపై వయసున్న రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులకు ఈ వీఆర్ఎస్ వర్తిస్తుందని ఎంటీఎన్ఎల్ స్పష్టం చేసింది. సంస్థలో 22 వేల ఉద్యోగులు పనిచేస్తుండగా, 15 వేల మందికి వీఆర్ఎస్ వర్తిస్తుందని సంస్థ సీఎండీ సునీల్ కుమార్ చెప్పారు.
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఈ సంస్థల పునరుద్ధరణ కోసం గత నెల కేంద్ర క్యాబినెట్ రూ.69 వేల కోట్ల ప్యాకేజీని ఆమోదించిన సంగతి విదితమే. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ను విలీనం చేస్తుండగా, ఆస్తుల నగదీకరణ, ఉద్యోగులకు వీఆర్ఎస్లు ఈ ప్యాకేజీలో భాగంగానే ఉన్నాయి. 2010 నుంచి ఇరు సంస్థలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఈ రెండిం టి రుణ భారం రూ.40 వేల కోట్లపైనే ఉంటుంది.