ప్రో కబడ్డి 2019: హర్యానా స్టీలర్స్ పై బెంగాల్ వారియర్స్ ఘనవిజయం
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ విజయయాత్ర కొనసాగుతోంది. తాజాగా హర్యానా స్టీలర్స్ తో తలపడ్డ బెంగాల్ జట్టు 12 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.
ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పూణేలోని చత్రపతి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వారియర్స్ ఆటగాళ్లు చేలరేగి హర్యానా స్టీలర్స్ ను చిత్తుచేశారు. ముఖ్యంగా వారియర్స్ ఆటగాడు మణీందర్ సింగ్ ఏకంగా 18 పాయింట్లతో రాణించాడు. అతడి విధ్వంసం ముందు నిలవలేక స్టీలర్స్ ఘోర ఓటమిని చవిచూసింది.
స్టార్ రైడర్ మణీందర్ చెలరేగడంతో బెంగాల్ కేవలం రైడింగ్ ద్వారానే 30 పాయింట్లు సాధించాడు. అలాగే ట్యాకిల్స్ లో 11, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్ట్రాల రూపంలో 1 ఇలా మొత్తం 48 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో మణీందర్ 18, ప్రభంజన్ 7, బల్దేవ్ 6, ఇస్మాయిల్ 5, రింకు 3 పాయింట్లతో వారియర్స్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
హర్యానా స్టీలర్స్ విషయానికి వస్తే రైడింగ్ లో 30 పాయింట్లు సాధించి వారియర్స్ కు గట్టిపోటినిచ్చింది. కానీ ట్యాకిల్స్ లో 5, ఆలౌట్ల ద్వారా కేవలం 2 పాయింట్లతో వునకబడింది. దీంతో ఆ జట్టు కేవలం 36 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. ఆటగాళ్లలో వినయ్ 14, వికాశ్ 9, నవీన్ 5, వికాస్ 3 పాయింట్లు సాధించినా స్టీలర్స్ ను గెలిపించుకోలేకపోయారు.