సోమిరెడ్డి బాగా తెలివి మీరిపోయారు
టిడిపి నేతల్లో చాలామందిపైన అవినీతి ఆరోపణలున్నాయి. వారంతా అంగీకరిస్తారా? ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబునాయుడు కూడా విచారణ జరగకుండా స్టే తెచ్చుకోలేదా?
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచిత్రమైన లాజిక్ మాట్లాడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూకుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలంటే జగన్ తన అక్రమ ఆస్తులను సిబిఐకి ఇచ్చేయాలట. ఎలాగుంది సోమిరెడ్డి బేరం. కొందరు టిడిపి నేతలు తమను తాము చాలా తెలివైన వాళ్ళనుకుంటుంటారు. అటువంటి వాళ్ళల్లో సోమిరెడ్డి కూడా ఒకరు. పైగా తనవి అక్రమాస్తులని జగన్ ఒప్పుకోవాలట.
జగన్ పైన అక్రమాస్తుల ఆర్జన కేసులున్నమాట వాస్తవం. ఆ కేసుల్లోనే జగన్ను సిబిఐ అరెస్టుచేసి 16 మాసాలు జైల్లో కూడా పెట్టింది. జగన్ సంపాదనలో అక్రమ సంపాదన కూడా ఉందనే అనుకుందాం. దాన్ని జగన్ ఎలా అంగీకరిస్తారు? జగనే కాదు ఎవరైనా అంగీకరిస్తారా? తన సంపాదనంతా అక్రమార్జనే అని దేశంలో అంగీకరించిన రాజకీయ నేతలెవరైనా ఉన్నారా?
అంతెందుకు టిడిపి నేతల్లో చాలామందిపైన అవినీతి ఆరోపణలున్నాయి. వారంతా అంగీకరిస్తారా? ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబునాయుడు కూడా విచారణ జరగకుండా స్టే తెచ్చుకోలేదా? ఇవన్నీ తెలీకుండానే సోమిరెడ్డి మాట్లాడుతున్నారా? తెలుసు, అయినా అలా మాట్లాడుతుంటారంతే. ఎందుకంటే జగన్ పై ఏం మాట్లాడినా అచ్చేసి వదిలే పచ్చ పత్రికులున్నాయి, చూపించే పచ్చ మీడియా ఉంది కాబట్టి.