రైలు ప్రయాణికులకు శుభవార్త..
- నో బిల్.. ఫ్రీ ఫుడ్ విధానాన్ని తీసుకువస్తున్న రైల్వే శాఖ
- నెలాఖరుకు అమలులోకి రానున్న విధానం
రైలు ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. రైల్లలో ఫుడ్ పేరిట జరుగుతున్న అక్రమాలకు రైల్వే శాఖ చెక్ పెట్టింది. ఈ మేరకు కొత్త నిబంధనను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు రైలులో ప్రయాణికులు కొనుగోలు చేసే ఆహారం, తినుబండారాలు.. అమ్మేవాళ్లు ఎంత చెబితే అంత పెట్టి కొనాల్సిందే. ఇక నుంచి ఈ నియమం లేదు. ఏ ఫుడ్ కొన్నా కచ్చితంగా వారి వద్ద నుంచి రసీదు తీసుకోవాలి. ఒక వేళ ఫుడ్ కేటరర్లు కనుక రసీదు ఇవ్వకపోతే.. ఆ ఫుడ్ కి మీరు బిల్లు చెల్లించాల్సన అవసరం లేదు. ఉచితంగా తినేయవచ్చు.
‘నో బిల్.. ఫ్రీ ఫుడ్’ పేరుతో ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని అమలు చేయాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భారతీయ రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) తన వెబ్సైట్లో కొత్త పాలసీ వివరాలను అందుబాటులో ఉంచింది. ఈ విషయంపై ప్రయాణికులను చైతన్యపరుస్తోంది. మరోవైపు తమ ఇన్స్పెక్టర్లను రైళ్లలో నియమించి, కేటరర్లు ప్రయాణికులకు రసీదులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. అధిక చార్జీలు, రసీదు ఇవ్వడానికి ఫుడ్ సర్వర్లు నిరాకరించడంపై ఏడు వేలకు పైగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. రైల్వే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.