పాకిస్థాన్ లో విడుదల కానున్న ‘బాద్షాహో’
- బాలీవుడ్ సినిమా ‘ బాద్షాహో’ రేపు పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కానుంది
- భారత్ లో గత శుక్రవారమే విడుదలైంది
అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘ బాద్షాహో’ రేపు పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కానుంది. భారత్ లో గత శుక్రవారమే విడుదలైన ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరనన ఇలియానా నటించింది. అయితే
ఈద్ పండగకు భారతీయ హై బడ్జెట్ సినిమాలను పాకిస్థాన్ లో విడుదల చేయకూడదంటూ .. పాక్ ఫిల్మ్ మేకర్స్.. డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ సమయంలో కేవలం తమ పాక్ సినిమాలు మాత్రమే విడుదల చేయాలనేది వారి నిర్ణయం. అదేవిధంగా రెండు సినిమాలను విడుదల చేశారు కూడా. కానీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్నది సమాచారం. ఈ నేపథ్యంలో బాద్షాహో సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది. ఈద్ పండగకే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని తొలుత భావించినప్పటికీ పాక్ నిర్ణయంతో వాయిదా వేశారు. గత వారం భారత్ లో విడుదల చేయగా.. రేపు(శుక్రవారం) పాకిస్థాన్ లో విడుదల చేస్తోంది.
ఈద్ పండగకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’ సినిమాను పాక్ లో విడుదల చేసేందుకు ప్రయత్నించగా.. అందుకు పాక్ ఫిల్మ్ మేకర్స్ అంగీకరించలేదు. దీంతో ఈ సినిమా విడుదలను నిలిపి వేశారు.పాకిస్థాన్ లో బాలీవుడ్ హీరోలకు అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. అందుకే పాక్ లోనూ మార్కెట్ పెంచుకునేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.
బాలీవుడ్ సినిమాలను కొన్నింటిని పాక్ లో బాన్ చేయడం కూడా జరిగింది. అందులో దంగల్, నామ్ షబానా, రాయీస్, ఉడ్తా పంజాబ్, డిష్యూం, శివాయ్, నీర్జా, యే దిల్ హై ముష్కిల్, బేబీ, హైదర్ వంటి సినిమాలు ఉన్నాయి.