Asianet News TeluguAsianet News Telugu

చిన్న నగరాల నుంచే 90% కొనుగోళ్లు: అమెజాన్

ఈ-కామర్స్ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని అమెజాన్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. 90% చిన్న పట్టణాల నుంచే కొత్త కొనుగోలుదారులు నమోదవుతున్నారని చెప్పారు. సకాలంలో వస్తువులు డెలివరీ చేయడం వల్లే నమ్మకంతోపాటు వినియోగదారులు పెరిగారని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ శాలిని పుచ్చలపల్లి తెలిపారు. 

Amazon house on wheels comes to Hyderabad
Author
Hyderabad, First Published Oct 5, 2019, 2:14 PM IST

‘నా చిన్నప్పుడు ఊర్లో వస్తువులు ఏవీ దొరికేవి కావు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవి కావు. వచ్చినా ఖరీదెక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ–కామర్స్‌ రాకతో ప్రపంచంలో లభించే ఏ వస్తువైనా ఆర్డరు చేయవచ్చు’ అని అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ షాలిని పుచ్చలపల్లి అన్నారు. 

అమెజాన్‌లో వస్తువులు తొలిసారిగా కొనుగోలు చేస్తున్న వారిలో 90% మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కొత్తగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారు బాగా పెరుగుతున్నారన్నారు.

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’లో తొలిసారిగా కొనుగోలు చేసిన వారిలో 90 శాతం మంది చిన్న పట్టణాలవారేనని అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోటా తెలిపారు. గతంలో కొనుగోలుదారులు మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు ఎక్కువగా కొనుగోలు చేసే వారని, ఈసారి ఫర్నీచర్‌, భారీ గృహోపకరణాలు, ఫ్యాషన్‌, అలంకరణ వస్తువులు, వంట సామాన్లు సహా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు.

శుక్రవారం అర్థరాత్రితో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ముగిసిందని, తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోటా అన్నారు. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ‘అమెజాన్‌ ఫెస్టివ్‌ యాత్ర’ను కంపెనీ ప్రారంభించింది. 

మూడు టాటా ట్రక్కులపై ఇంటిని నిర్మించి 13 నగరాలకు అమెజాన్ ఫెస్టివ్ నిర్వహిస్తున్నారు. ‘హౌస్‌-ఆన్‌-వీల్స్‌’లో అమెజాన్‌లో విక్రయించే వస్తువుల్లో వివిధ రాష్ట్రాల 600 ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. యాత్రలో భాగంగా ఇది హైదరాబాద్‌కు విచ్చేసింది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరుతో యాత్ర ముగుస్తుంది.
 
ప్రస్తుతం 10 కోట్ల మందికి పైనే అమెజాన్‌ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్న ఖాతాదారులు ఉన్నారని.. సమీప భవిష్యత్తులో మరో 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించే లక్ష్యంతో అమెజాన్‌ అడుగులు వేస్తోందని పుచ్చలపల్లి శాలినీ వివరించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లు అత్యంత వేగంగా పెరుగుతున్నారు. 

గత ఏడాదిన్నర కాలంలో అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు 100 శాతం పెరిగారని అమెజాన్ ఇండియా డైరెక్టర్ పుచ్చలపల్లి శాలినీ అన్నారు. ఇ-కామర్స్‌ అమ్మకాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని, ప్రస్తుతం తెలంగాణాలో 18 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల మంది విక్రయదారులు ఉన్నారని చెప్పారు.
 
కొనుగోలుదారుడికి అత్యధిక ప్రాధాన్యం, ఆకర్షణీయమైన ధరలు, ఇబ్బందుల్లేని బట్వాడా వ్యూహంతో అమెజాన్‌ అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంతోనే వస్తు విక్రయదారులు, కొనుగోలుదారులు పెరుగుతున్నారని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ పుచ్చలపల్లి శాలినీ తెలిపారు. 

ఈ-కామర్స్‌పై నమ్మకం పెరగడం, చిన్న పట్టణాల్లోని వారు కూడా అధిక వస్తు శ్రేణి నుంచి ఉత్పత్తులను ఎంపిక చేసుకునే అవకాశం, డెలివరీలు అమ్మకాలు పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. 2016లో అమెజాన్‌లో విక్రేతలు లక్ష మంది ఉంటే.. 2019 నాటికి 5 లక్షలకు పెరిగారని పుచ్చలపల్లి శాలినీ చెప్పారు. 
భవిష్యత్తులోనూ ఈ వృద్ధి కొనసాగుతుందని పుచ్చలపల్లి శాలినీ అన్నారు. గత ఏడాదిలోనే 1.2 లక్షల మంది విక్రయదారులు తమ ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. 

గత ఏడాదిలో 17 కోట్ల వస్తువులను అమెజాన్‌లో విక్రయిస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 కోట్లకు పెరిగిందని.. రోజుకు 2 లక్షల వస్తువులు వచ్చి చేరుతున్నాయని పుచ్చలపల్లి శాలినీ వివరించారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 50కి పైగా ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలున్నాయి. 

వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 2.6 కోట్ల ఘనపు అడుగులు. కొనుగోలు చేసిన వస్తువులను బట్టి చిన్న పట్టణాల్లో కూడా మరుసటి రోజే డెలివరీ చేస్తున్నామని, 200 పిన్‌కోడ్‌ల్లో రెండు రోజుల్లో డెలివరీ అవుతున్నాయని పుచ్చలపల్లి శాలినీ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios