శారీరకంగా హింసించకపోయినా మానసికంగా వేధించారు: రక్షణమంత్రితో అభినందన్
పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన సమయంలో తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా మాత్రం వేధించారని ఆరోపించారు. అభినందన్ ను కలిసిన తర్వాత ఐఏఎఫ్ అధికారులు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ: వాయుపుత్రుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిర్ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రంలో ఉన్న అభినందన్ ను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, పలువురు అధికారులు కలిశారు.
పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన సమయంలో తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా మాత్రం వేధించారని ఆరోపించారు. అభినందన్ ను కలిసిన తర్వాత ఐఏఎఫ్ అధికారులు మీడియాతో మాట్లాడారు.
పాకిస్తాన్లో వేధింపులకు గురైనా అభినందన్ మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తమ భూభాగంలో దొరికిపోయిన తరువాత అభినందన్పై కొందరు స్థానికులు భౌతిక దాడికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. కానీ తాము ఆయనని రక్షించి జెనీవా ఒప్పంద మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందించామని పాకిస్తాన్ పేర్కొన్న స్పష్టం చేసిందని తెలిపారు.
గాయాలతో రక్తం కారుతుండగా అభినందన్ను పాకిస్తాన్ సైనికులు తీసుకెళ్తున్న వీడియో విడుదల చెయ్యడంతో యావత్ భారతావని ఆగ్రహానికి గురైంది. భారత్ ఆగ్రహాన్ని పసిగట్టిన పాకిస్థాన్ ఆ తర్వాత అక్కడి సైనికులతో మాట్లాడుతూ అభినందన్ టీ తాగుతున్న మరో వీడియోను పాకిస్థాన్ విడుదల చేసింది.
అలాగే భారత్కు అప్పగించే ముందు అభినందన్తో పాకిస్తాన్ సైన్యాన్ని పొగుడుతూ ఓ వీడియోను రూపొందించినట్లు పాకిస్థాన్ మీడియాలో కథనలా వెల్లడయ్యాయి. అల్లరి మూక నుంచి పాకిస్తాన్ ఆర్మీయే తనను కాపాడిందని చెప్పిన ఆ వీడియో షూటింగ్ వల్లే అభినందన్ అప్పగింత ఆలస్యమైందని కూడా ప్రచారం జరుగుతుంది.
పాకిస్తాన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన సమయంలో అభినందన్ కుడి కన్ను ఉబ్బినట్లు కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభినందన్ ధైర్యసాహసాల పట్ల దేశం గర్విస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. పాకిస్థాన్ చెరలో ఉన్న 60 గంటలపాటు అభినందన్ ఎదుర్కొన్న అనుభవాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.
ఇకపోతే పాక్ నిర్బంధం నుంచి విడుదలైన పైలట్ అభినందన్కు రెండు రోజులపాటు వైద్యపరీక్షలు చెయ్యనుంది ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్ మెంట్. అందులో భాగంగా శనివారం నుంచే వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఈ వైద్యపరీక్షలు ఆదివారం కూడా కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
కూలింగ్ డౌన్ విధానంలో అభినందన్ మానసిక, శారీరక ఆరోగ్య స్థితిగతుల్ని అధ్యయనం చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి అధికారులు పూర్తి సమాచారాన్ని అభినందన్ నుంచి రాబట్టనున్నారు.