బాద్ షా ఎవరో తేలేది రేపే: కౌంటింగ్ కు సర్వం సిద్ధం
ఇకపోతే దేశవ్యాప్తంగా సుమారు 10.3లక్షల కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం 99కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలు జరిగినప్పటికీ గెలుపు ఎవరిదో అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మే 23న ఆ ఉత్కంఠకు తెరదించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్కంఠకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 542 లోక్ సభ స్థానాలకు గానూ 8 వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగాయి. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీవైపు నిలిచారో ఏ పార్టీకి పట్టం కట్టారో అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
గురువారం ఉదయం 8 గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా సుమారు 10.3లక్షల కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తం 99కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఇప్పటివరకు భారత పార్లమెంట్కు నమోదైన ఓటింగ్లో ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 18లక్షల మంది ఉద్యోగుల్లో 16.49 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు కొన్ని గంటలు పడుతుందని ఈసీ భావిస్తోంది.
వీవీప్యాట్ స్లిప్పులను చివరలో లెక్కించనున్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాక ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిచూస్తారు. రెండింటికీ మధ్య వ్యత్యాసం వస్తే వీవీప్యాట్ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఐదు గంటల సమయం పడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
దేశంలోని 542 లోకసభ స్థానాలకు ఏడు విడతల పోలింగ్ జరిగింది. చివరి విడత ఈ నెల 19వ తేదీన జరిగింది. బిజెపి, కాంగ్రెసు పార్టీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.