పెళ్లి మధ్యలో.. ఆట కోసం వెళ్లిన వరుడు..
మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా.. ఓ వరుడు ఫుట్ బాల్ ఆడాలని చెప్పి.. మండపంలో నుంచి లేచి వెళ్లిపోయాడు.
మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా.. ఓ వరుడు ఫుట్ బాల్ ఆడాలని చెప్పి.. మండపంలో నుంచి లేచి వెళ్లిపోయాడు. వెళ్లి.. ఫుట్ బాల్ గేమ్ ఆడి.. తన జట్టుని గెలిపించి వచ్చాడు.. వధువు మాత్రం.. వరుడి చర్యకు బిత్తరపోయి మండపంలోనే కూర్చుండిపోయింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళకు చెందిన రిద్వాన్ కి ఫుట్ బాల్ ఆట అంటే పిచ్చి. అతను ఫిఫా మంజెరీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడి పెళ్లి రోజునే మలప్పురం 7s ఫుట్బాల్ టోర్నీ జరుగుతోంది. దీంతో.. అతను ఆట ఆడాల్సిన అవసరం ఏర్పడింది. పెళ్లి మరికాసేపట్లో అనగా.. వధువు దగ్గరకు వెళ్లి.. 5 నిమిషాలు ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.
అద్భుతంగా ఆడి.. జట్టును గెలిపించాడు. 5 నిమిషాల్లో వస్తా అన్న వరుడు ఇంకా రాకపోవడంతో పెళ్లి మండపంలో అందరూ కంగారు పడిపోయారు. తీరా ఆరా తీస్తే.. మ్యాచ్ కోసం వెళ్లాడని తెలిసింది. ఇంకేముంది వధువు, ఆమె కుటుంబసభ్యులు మండిపడిపోయారు. వరుడు మండపానికి రాగానే.. ఒకరి తర్వాత ఒకరు అతనిపై ఫైర్ అయ్యారు. మరి అలిగిన వధువు అలక ఎలా తీర్చాడో లేదో మాత్రం తెలియరాలేదు.