కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న ఉప ఎన్నికలు
కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం నాడు విడుదల చేశారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ ప్రకటించారు. అదే నెల 9వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.
Also read:కేసు పెండింగ్ ఎఫెక్ట్: కర్ణాటక ఉప ఎన్నికలకు బ్రేక్
కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నందున ఈ నెల 11వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జరగాలి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడ విడుదల చేసింది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి బలపరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ ఫిర్యాదు మేరకు 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. స్పీకర్ ఆదేశాల మేరకు ఆరేళ్ల పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదు.అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ తరుణంలో తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు ఈసీ తెలిపింది. ఈ కారణంగానేసెప్టెంబర్ మాసంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు.
హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వంపై జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్లకు వ్యతిరేకంగా ఓటు చేశారు. పార్టీ విప్లను ధిక్కరించి ఓటు చేసినందుకు గాను అప్పటి స్పీకర్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
అనర్హత పిటిషన్లపై కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై ఈ నెల 13వ తేదీన తన తీర్పును వెలువరించనుంది.సుప్రీంకోర్టు అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్ పై తీర్పు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.