జయలలిత హాస్పటల్ బిల్లు రూ.6కోట్లు, భోజనానికే రూ.1.17కోట్లు
భోజనం కోసం మరో 1.17 కోట్ల బిల్లు వేశారు. 75 రోజుల పాటు అపోలో హాస్పటల్లో జయ చికిత్స పొందారు. ఆ సమయంలో హాస్పటల్ వద్ద క్యాంపు చేసిన జర్నలిస్టులకు ఆహారాన్ని అందించారు. దాని కోసం హాస్పటల్ సుమారు 50 లక్షల బిల్లును వేసింది.
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత .. అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతూ.. అక్కడే కన్నుమూశారన్న విషయం మనకు తెలిసిందే. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందినందుకు ఎంత బిల్లు అయ్యిందో.. తాజాగా అపోలో హాస్పిటల్ ప్రకటించింది.
2016లో సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జయ అపోలో హాస్పటల్లో చికిత్స పొందారు. ఆ సమయంలో ఆమె హాస్పటల్ బిల్లు 6 కోట్ల 85 లక్షలు అయినట్లు తెలిసింది. దాంట్లో రెండు విడుతలుగా ఇప్పటికే బిల్లులను చెల్లించారు. అపోలో హాస్పిటల్కు ఇంకా 44.56 లక్షల బిల్లు బాకీ ఉన్నట్లు తెలిసింది. అయితే మొదటి దఫాలో అపోలోకు 6 కోట్ల బిల్లును కట్టేశారు. ఆ తర్వాత మరోసారి 41.13 లక్షల బిల్లును చెల్లించారు. మొదటి బిల్లును ఎవరు కట్టారన్న విషయం తెలియదు. కానీ రెండవ బిల్లును మాత్రం అన్నాడీఎంకే పార్టీ చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ విషయం బయటపడింది.
జయలలిత కోసం అపోలో డాక్టర్లు ఇచ్చిన చికిత్స బిల్లు 1.9 కోట్లుగా ఉంది. దాంట్లో వార్డ్ ఫార్మసీ బిల్లు 38 లక్షలు. ఇక రూమ్ రెంట్ కోసం 24 లక్షల బిల్లు వేశారు. జయ చికిత్స సమయంలో హాస్పటల్ యాజమాన్యం ప్రత్యేక రూమ్లను ఏర్పాటు చేసింది. దాని కోసం అదనంగా మరో 1.25 కోట్ల బిల్లును వసూల్ చేసింది. శశికళతో పాటు అధికారుల కోసం సుమారు 20 రూమ్లను వాడినట్లు తెలుస్తోంది.
భోజనం కోసం మరో 1.17 కోట్ల బిల్లు వేశారు. 75 రోజుల పాటు అపోలో హాస్పటల్లో జయ చికిత్స పొందారు. ఆ సమయంలో హాస్పిటల్ వద్ద క్యాంపు చేసిన జర్నలిస్టులకు ఆహారాన్ని అందించారు. దాని కోసం హాస్పటల్ సుమారు 50 లక్షల బిల్లును వేసింది. భద్రత కల్పించిన పోలీసుల కోసం కూడా 25 లక్షల భోజన ఖర్చులుగా నిర్ధారించారు. ముఖ్యమైన విజిటర్స్ కోసం 20 లక్షలు, గవర్నమెంట్ అధికారుల కోసం మరో 20 లక్షలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు మరో 5 లక్షలు ఖర్చు చేశారు.