ఇస్రో మరో ఘనత... విజయవంతంగా నింగిలోకి జీశాట్-31
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నింగీలో తనకు ఎదురు లేదని రుజువు చేసింది. దేశ కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జీశాట్ 31ను విజయవంతంగా ప్రయోగించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నింగీలో తనకు ఎదురు లేదని రుజువు చేసింది. దేశ కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన జీశాట్ 31ను విజయవంతంగా ప్రయోగించింది. ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లో కక్ష్యలో చేరింది. జీశాట్-31తో పాటు సౌదీ అరేబియాకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు.
జీశాట్-31 ఇస్రో సాంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్శాట్, జీశాట్లకు ఆధునిక రూపమని స్పేస్ నిపుణులు చెబుతున్నారు. భారత భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది.
దీని బరువు 2,535 కిలోలు, సుమారు 15 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం నిరాటంకంగా సమాచారాన్ని అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల వీశాట్ నెట్వర్క్స్, టెలివిజన్ అప్లింక్స్, డిజిటల్ శాటిలైట్, డీటీహెచ్ టెలివిజన్, సెల్యూలర్ బ్యాకప్లకు అనుకూలమైన సాంకేతికత సొంతమైనట్లు ఇస్రో తెలిపింది.