వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు అమ్మాయిలు
ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది
ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. గతేడాది స్వలింగ సంపర్కం నేరం కాదూ అంటూ.. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుకి అనుగుణంగా.. ఇద్దరు యువతులు వివాహమాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
మహాకాపరాకు చెందిన ఓ యువతి, పట్టముండైకి చెందిన మరో యువతి కటక్ లోని స్కూల్లో చదువుకున్నారు. ఆ సమయంలోని వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం ఒకరికి మరొకరు తోడు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. వారి నిర్ణయాన్ని పెద్దలు విభేదించారు. అంతేకాకుండా.. ఆ ఇద్దరు అమ్మాయిలకు అబ్బాయిలతో పెళ్లి చేసేందుకు సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు.
దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు వెంటనే కోర్టును ఆశ్రయించారు. తాముపెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వారు కోర్టుకు తెలిపారు. అంతేకాదు కోర్టులో ఆఫిడవిట్ కూడా దాఖలు చేశారు. తాము జీవితాంతం కలిసి ఉంటామని.. భవిష్యత్తులో ఎలాంటి గొడవలు జరిగినా.. వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అనంతరంత వివాహబంధంతో ఒక్కటయ్యారు.