బిల్డింగ్ పై నుంచి దూకి ఏసీపీ ఆత్మహత్య
బహుళ అంతస్థు భవనంపై నుంచి కిందకు దూకి ఓ పోలీసు అధికారి కన్నుమూసిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది
బహుళ అంతస్థు భవనంపై నుంచి కిందకు దూకి ఓ పోలీసు అధికారి కన్నుమూసిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి ప్రేమ్ వల్లభ్(55) గురువారం ఉదయం పోలీసు హెడ్ క్వార్టర్స్ భవనం పై నుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో.. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రేమ్ వల్లభ్.. ప్రస్తుతం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగంలో విధులు నిర్వరిస్తున్నారు. అయితే.. పని ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 1986లో హెడ్ కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరిన ఈయన వివిధ హోదాలు దాటి 2016లో ఏసీపీ అయ్యారు.
మానసిక ఒత్తిడి వల్ల ఆయన ఇటీవలే 28 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారని పోలీసులు తెలిపారు. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.