అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఓ ఎమ్మెల్యే.. సభలో అందరి ముందూ కన్నీరు పెట్టుకున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఓ ఎమ్మెల్యే.. సభలో అందరి ముందూ కన్నీరు పెట్టుకున్నారు. చనిపోయిన తన ఆవును గుర్తుతెచ్చుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం రాజస్థాన్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. అనంతరం గో సంరక్షణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ ఖాన్ మాట్లాడారు. తాను పెంచుకున్న ఆవుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆవు ఎప్పుడూ తన పక్కనే ఉండేదని.. ఇప్పుడు చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవు గురించి మాట్లాడుతుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదని ఆయన పేర్కొన్నారు. గో సంరక్షణ పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాగా.. ఆయన మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.