అయోధ్య కేసు:' అక్టోబర్ 18 నాటికి వాదనలు పూర్తి కావాల్సిందే'
అయోధ్య కేసులో వాదనలను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇరు పక్షాల న్యాయవాదులను కోరింది.
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో ఇరుపక్షాల వాదనలను ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.అయోధ్య భూ వివాదం కేసు విషయమై గురువారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ మేరకు ఇరు పక్షాల న్యాయవాదులకు సూచించారు.
ఈ ఏడాది నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి కాలం ముగియనుంది. అయితే తన పదవీకాలం ముగిసేలోపుగానే ఈ కేసుపై తీర్పు వెలువడితే నాలుగు వారాల్లో ఈ కేసుకు సంబంధించిన నిర్ణయం వెలువరించి రికార్డు సృష్టించనుంది.
అక్టోబర్ 18వ తేదీ నాటికి ఇరు పక్షాల వాదనలు పూర్తి చేయాలంటే దీపావళి సెలవుల్లో కూడ కోర్టు వాదనలను వినే అవకాశం లేకపోలేదు.శనివారాల్లో ఎక్కువ సమయం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు పనిచేస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వింటుంది.