తాగి పీటల మీద కూర్చున్న వరుడు.. షాకిచ్చిన వధువు
మరికాసేపట్లో వధువు మెడలో తాళికట్టి..కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు.. తన చేతులతో తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
మరికాసేపట్లో వధువు మెడలో తాళికట్టి..కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు.. తన చేతులతో తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పీకలదాకా మద్యం తాగి పెళ్లి పీటలు ఎక్కాడు. విషయం గ్రహించిన వధువు తనకు ఈ వరుడు వద్దంటూ తేల్చి చెప్పింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాట్నాకి సమీపంలోని తిలక్ పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ రజన్ అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి అక్బర్ పూర్ నకు చెందిన యోగేంద్ర రజక్ కుమార్తెతో వివాహం నిశ్చయమైంది.
మరికాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు పీకల దాకా మద్యం తాగి మండపానికి వచ్చాడు. అక్కడ వధువు తరపు బంధువులతో గొడవ పడటం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న వధువు.. తనకు ఈ పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. మద్యం అలవాటు ఉన్న వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆమెకు కుటుంబసభ్యులు, గ్రామస్థులు కూడా మద్దతుగా నిలిచారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది.
కాగా.. పెళ్లి మండపంలో గొడవ చేసినందుకు.. మద్యం సేవించినందుకు గాను అతనిపై వధువు తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అతనిని పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ రాష్ట్రంలో మద్య పాన నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.