బెంగాల్లో బీజేపీకి రసగుల్లా, మోడీకి మిగిలేది మంచమే: మమత సెటైర్లు
ప్రధాని నరేంద్రమోడీపై మాటల తూటాలు పేల్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దక్షిణ్ దినాజ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో దీదీ పాల్గొన్నారు
ప్రధాని నరేంద్రమోడీపై మాటల తూటాలు పేల్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా దక్షిణ్ దినాజ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
బెంగాల్లో భారీగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటామన్న ప్రధాని ఆశలు పగటి కలలేనని... ఇక్కడ బీజేపీకి ‘‘రసగుల్లా’’నే (సున్నాను సూచిస్తూ) దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో కనీసం సగమైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని, కానీ 2014 ఎన్నికల్లో వచ్చినట్లు ఈసారి కనీసం రెండు సీట్లు గెలవదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 100 సీట్లు కూడా రావన్నారు.
ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవదని జోస్యం చెప్పారు. ఛాయ్వాలా ప్రధానికి కేథీవాలా (ఛాయ్ వుంచే పాత్ర) ఆర్ధిక మంత్రి అని అరుణ్ జైట్లీని ఉద్దేశిస్తే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఐదు సంవత్సరాల క్రితం తాను ఛాయ్వాలా అని, ఇప్పుడు చౌకీదార్ అని చెప్పుకుంటున్న మోడీకి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మిగిలేది చౌకీనే (మంచం) అన్నారు. 2014లో బీజేపీ గెలిచిన డార్జిలింగ్ సహా మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని మమత ధీమా వ్యక్తం చేశారు.