త్వరలో ఎన్నికలు.. సుమిత్రామహాజన్ షాకింగ్ డెసిషన్
త్వరలో ఎన్నికలు జరనుండగా.. స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని ఆమె తేల్చిచెప్పారు.
త్వరలో ఎన్నికలు జరనుండగా.. స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని ఆమె తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అయితే.. పోటీ చేయకూడదు అనేది ఆమె నిర్ణయం కాదని.. పార్టీనే ఆమెను దూరం పెట్టారనే వాదన బలంగా వినపడుతోంది.
ఎందుకంటే.. వయసుపైబడిన నాయకులందరినీ పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలను ఎన్నికలకు దూరంగా ఉంచింది. అందులో భాగంగానే సుమిత్రా మహాజన్ కి కూడా టికెట్ ఇవ్వలేదని.. ఆ విషయం బయటపెట్టకుండా తానే స్వయంగా ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థి ప్రకటన విషయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో సుమిత్రా మహాజన్ స్వయంగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదంటూ తాజా ప్రకటన చేశారు. ఇదే సమయంలో ఇండోర్ నుంచి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదంటూ అధిష్ఠానాన్ని నిలదీశారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్ల సుమిత్రా మహాజన్ రికార్డు స్థాయిలో 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.