ప్రధానుల అడ్డా ఉత్తర్ ప్రదేశ్
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుండే అత్యధికంగా ప్రధానమంత్రి పదవిని దక్కించుకొన్నారు. యూపీయేతర రాష్ట్రాల నుండి కేవలం ఆరుగురు మాత్రమే ప్రధానులుగా పనిచేశారు.
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుండే అత్యధికంగా ప్రధానమంత్రి పదవిని దక్కించుకొన్నారు. యూపీయేతర రాష్ట్రాల నుండి కేవలం ఆరుగురు మాత్రమే ప్రధానులుగా పనిచేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన సమయం నుండి ఇప్పటివరకు 15 మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. ఇందులో 9 మంది యూపీ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.
దేశానికి తొలుత ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆ తర్వాత కూడ ఇదే రాష్ట్రానికి చెందిన వారు ప్రధానమంత్రి పదవుల్లో కొనసాగారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్. గత ఎన్నికల్లో మోడీ యూపీ రాష్ట్రం నుండి ఎంపీగా విజయం సాధించారు.
నెహ్రు, లాల్బహదూర్ శాస్త్రి, చౌదరి చరణ్ సింగ్, వీపీ సింగ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్పేయ్, చంద్రశేఖర్ లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇక ప్రధానులుగా పనిచేసినవారిలో యూపీయేతర రాష్ట్రాల నుండి ఉన్నవారు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒక్కరు తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు కూడ కావడం విశేషం.
అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి పీవీ నరసింహారావు ప్రధానిగా కొనసాగారు. ప్రధానిగా ఉన్న సమయంలోనే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ నుండి ఆయన పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధానులుగా ఎన్నికైన యూపీయేతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల్లో పీవీ నరసింహారావుతో పాటు మన్మోహాన్ సింగ్, దేవేగౌడ, ఐకే గుజ్రాల్, మొర్జారీ దేశాయ్, గుల్జారీలాల్ నందాలు ఉన్నారు.
యూపీయేతర రాష్ట్రాల నుండి ప్రధానులుగా కొనసాగిన వారిలో పూర్తి కాలం పదవిలో ఉన్న వారిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు ఐదేళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. అయితే త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ, ఎన్టీయేతర కూటమి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఈ రెండు కూటములకు మధ్య దూరంగా ఉన్న పార్టీలు కూడ ఏ రకమైన పాత్ర పోషిస్తాయనేది ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ఎన్డీఏ కూటమికి సాధారణ మెజారిటీ లభించే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ బీజేపీకి గతంలో మాదిరిగా స్పష్టమైన మెజారిటీ దక్కకపోతే బీజేపీ ఏం చేస్తోందోననే రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరోవైపు బీజేపీయేతర కూటమిలో 21 పార్టీలు ఉన్నాయి. ఈ కూటమికి మెజారిటీ వస్తే ఈ కూటమిలో ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ కూటమికి 272 సీట్లు దక్కుతాయా లేదా అనే చర్చ కూడ లేకపోలేదు.
అయితే ఈ కూటమిలోని కొన్ని పార్టీలు తమ స్వంత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. దరిమిలా ప్రధాని పదవిని కాంగ్రెస్ విడిచిపెడుతుందా లేదా అనే చర్చ కూడ సాగుతోంది.