Asianet News TeluguAsianet News Telugu

వేతనాల్లో వ్యత్యాసం.. ఆర్థిక భవితవ్యంపై అతివల్లో బెంగ..

ఆధునిక కాలంలో పురుషులతో సమానంగా పని చేస్తున్నా మహిళల వేతనంలో వ్యత్యాసం కొనసాగుతూనే ఉన్నది. మహిళలు ఎక్కువగా పనిచేసే హెల్త్ కేర్ రంగంతోపాటు అన్ని రంగాల్లో పురుషుల వేతనం 19 శాతం ఎక్కువ. 

Gender pay gap still high, women in India earn 19 per cent less than men, says repor
Author
New Delhi, First Published Mar 8, 2019, 11:23 AM IST

శరవేగంగా అభివ్రుద్ధి చెందుతున్నా భారత్‌లో ఇప్పటికీ స్త్రీ, పురుషులకు వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉందని తేలింది.  మగవారితో పోలిస్తే మహిళలు 19 శాతం తక్కువ వేతనం అందుకుంటున్నారని మాన్‌స్టర్‌ శాలరీ ఇండెక్స్‌ (ఎంఎస్ఐ) అధ్యయనంలో వెల్లడైంది.

అన్ని రంగాల్లోనూ మహిళా ఉద్యోగుల కంటే మగవారు అధిక జీతం అందుకుంటున్నారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేట్‌ రంగంలో మహిళల పట్ల వివక్షపై ఎంఎస్ఐ ఈ నర్వే నిర్వహించింది. 

ఎంఎస్ఐ సర్వే ప్రకారం గత ఏడాది మగవారి సరాసరి వేతనం గంటకు రూ.242.49 కాగా, మహిళల జీతం రూ.196.30గా నమోదైంది. మహిళల కంటే మగవారు 46.19 రూపాయల అధిక వేతనం అందుకున్నారు. 
 
ఐటీ, ఐటీఈఎస్‌, మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో వేతన వ్యత్యాసం అధికంగా ఉంది. మహిళలు అధికంగా పనిచేసే హెల్త్‌కేర్‌, కేర్‌ సర్వీసెస్‌, సోషల్‌ వర్క్‌ వంటి రంగాల్లోనూ మగవారే అధిక వేతనాలు పొందుతున్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా రంగాల్లో మాత్రం వ్యత్యాసం చాల స్వల్పంగా ఉంది.
 
పనిలో అనుభవంతోపాటే వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం కూడా పెరుగుతుండటం మరో ముఖ్య అంశం. ఫ్రెషర్లు, స్వల్పకాలిక అనుభవం కలిగిన స్త్రీ, పురుష సిబ్బంది జీతాల్లో అంతగా వ్యత్యాసం స్వల్పమే.

కానీ, అనుభవం పెరిగే కొద్దీ వ్యత్యాసం కూడా పెరుగుతోంది. ఉదాహరణకు 10 ఏళ్ల అనుభవం కలిగిన మగవారు అంతే అనుభవం కలిగిన మహిళా ఉద్యోగితో పోలిస్తే 15 శాతం అధిక వేతనం అందుకుంటున్నారు.

భారత్‌లో ఈ వేతన వ్యత్యాసం 2017లో 20 శాతంగా ఉండగా.. గత ఏడాది ఒక శాతం తగ్గి 19 శాతానికి పరిమితమైంది. వ్యత్యాసం తగ్గించే దిశగా కంపెనీలు, పరిశ్రమలు మరెంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంఎస్ఐ నివేదిక అభిప్రాయపడింది.
 
పనిలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వారి ఆందోళనలపైనా మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం చేపట్టింది. వేతన వ్యత్యాసాన్ని తగ్గించడం తమ కంపెనీ అతి ముఖ్యమైన ప్రాధాన్యతల్లో ఒకటి కావాలని సర్వేలో పాల్గొన్న 71 శాతం మగవారు, 66 శాతం మహిళలు పేర్కొన్నారు.

పనిలో తాము వివక్షకు గురవుతున్నట్లు 60 శాతం మంది మహిళా ఉద్యోగులు తెలిపారు. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుండగా నిరుద్యోగ రేటు జీవన కాల గరిష్ఠాలకు చేరుతోంది. దీంతో ఆర్థిక భవిష్యత్‌పై ఆందోళనకు గురయ్యేవారు ఎక్కువయ్యారు.

మహిళల్లో 83 శాతం మంది బాధపడుతుండగా, పురుషుల్లో 87 శాతం మంది తమ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారని ఎస్‌అండ్‌పీ నివేదిక పేర్కొంది. 84 శాతం మంది మహిళలు, 88 శాతం మంది పురుషులు ఆర్థిక భవిష్యత్తుపై కొంత మేరకు ఆందోళన చెందుతోంటే, 35 శాతం మంది మహిళలు మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నట్లు నివేదిక తేల్చింది.

ఈ స్థాయిలో మరే దేశంలోనూ మహిళలు బాధపడటం లేదని తెలిపింది. పురుషులు, మహిళల్లో అత్యధిక ఒత్తిడికి గురి చేస్తున్న అంశాల్లో ఉద్యోగాలు-ఆర్థిక వ్యవస్థ వాటా 25 శాతం ఉండగా, విద్య 24 శాతం, ఆరోగ్య సంరక్షణ 21 శాతం ఉన్నట్లు నివేదికలో తేటతెల్లమైంది.

ఆర్థిక వృద్ధి, స్టాక్‌ మార్కెట్లు, ఊహించని అనారోగ్యాలు తమ ఆర్థిక స్థితిని తమ ఆధీనంలో లేకుండా చేస్తున్నాయని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నిర్వహించిన 2018 సర్వే ఆధారంగా రూపొందించిన నివేదికలో నిరుద్యోగ రేటు 46 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు వెల్లడైంది.

ఈ అధికారిక నివేదికను ప్రభుత్వం ఆమోదించక మునుపే వివరాలు బయటకు పొక్కడంతో ఆ సంస్థ ఛైర్మన్‌ రాజీనామా చేయాల్సి వచ్చిన అంశాన్ని కూడా ఎస్‌అండ్‌పీ నివేదికలో ప్రస్తావించింది. మహిళలు భారత దేశంతోపాటు ఆసియా జనాభాలో 49 శాతం మంది ఉన్నారు. జీడీపీలో 36 శాతం వాటా వారిదే. అయినా కంపెనీల బోర్డుల్లో వారికి 12 శాతమే స్థానం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios