ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: భారత్ సర్జికల్ స్ట్రైక్స్పై ఇమ్రాన్
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్రివిధ దళాలచీఫ్లను కోరారు.
ఇస్లామాబాద్: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్రివిధ దళాలచీఫ్లను కోరారు.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త్రివిధ దళాల అధిపతులతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. పాక్లోని బాలకోట్ వద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడిన తర్వాత ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు.
త్రివిధ దళాల అధిపతులతో ఇమ్రాన్ ఖాన్ అత్యవసరంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ సమావేశం నిర్వహించినట్టుగా పీఎంఓ ప్రకటించింది. ఈ సమావేశంలో త్రివిధ దళాల చీఫ్లు పాల్గొన్నారని పీఎంఓ స్పష్టం చేసింది.
జమ్మూలోని పూల్వామాలో ఈ నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ దాడికి తామే బాధ్యులమని జేషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీనికి కౌంటర్గానే ఇవాళ తెల్లవారుజామున ఇండియా పీఓకేలో జేషే ఉగ్రవాద శిబిరాలపై దాడులకు పాల్పడింది.
ఇదిలా ఉంటే భారత్ యుద్ద విమానాలు తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడికి పాల్పడిన విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. మరో వైపు సరైన సమయంలో భారత్కు బుద్ది చెబుతామని ఆయన ప్రకటించారు.