మూడేళ్ల కిందటి కుళ్లిన మాంసాన్ని సర్వ్ చేస్తున్న టాప్ రెస్టారెంట్
మూడేళ్ల క్రితం నాటి కుళ్లిన మాంసాన్నే కష్టమర్లకు వండిపెడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మాంసం.. రెండు, మూడు రోజులు కూడా నిల్వ ఉండదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడేళ్ల కిందటి మాంసం.. అది కూడా కుళ్లిపోయింది.. దానినే కష్టమర్లకు వండి పెడుతోంది ఓ టాప్ రెస్టారెంట్. కంగారుపడకండి.. మన దగ్గర కాదులేండి. పాకిస్థాన్ లో.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ లోని కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ఏరియాలో ఉన్న అరిజోనా గ్రిల్ రెస్టారెంట్ లో ఓ కుటుంబం భోజనం చేసింది. కాగా.. తల్లి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండగా.. ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన అక్కడ కలకలం రేపింది.
దీంతో స్పందించిన అధికారులు అప్పటికప్పుడు రెస్టారెంట్ సీజ్ చేశారు. తాజాగా ఆ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కాగా.. ఆ దాడుల్లో బయటపడిన సంగతులు చూసి అధికారులే షాకయ్యారు. మూడేళ్ల క్రితం నాటి కుళ్లిన మాంసాన్నే కష్టమర్లకు వండిపెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 80కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఈ కుళ్లిపోయిన ఆహారం తినడం కారణంగానే చిన్నారులకు ఫుడ్ పాయిజినింగ్ జరిగిందని.. అందుకనే వారు చనిపోయారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెస్టారెంట్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
related news
రెస్టారెంట్లో కలుషిత ఆహారం.. ఇద్దరు బాలురు మృతి, చావుబతుకుల్లో తల్లి