పాక్కు షాకిచ్చిన అమెరికా: ఎఫ్-16 యుద్ధ విమానం దుర్వినియోగం
తమపైకి పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించిందని ఇండియా ఆరోపణలు చేసింది. ఎప్-16 యుద్ధ విమానం దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని పాకిస్తాన్ను అమెరికా కోరింది
వాషింగ్టన్: తమపైకి పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించిందని ఇండియా ఆరోపణలు చేసింది. ఎప్-16 యుద్ధ విమానం దుర్వినియోగానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని పాకిస్తాన్ను అమెరికా కోరింది.
ఎఫ్–16 విమానాలను తీవ్రవాద వ్యతిరేక పోరాటానికే ఉపయోగించాలని, ఇతర దేశాలపై దాడికి వాడరాదని అమెరికా షరతు విధించింది. దీన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని భారత్పై పాక్ ఉపయోగించిందని అమెరికాకు ఫిర్యాదు అందింది.
భారత్పై ఎఫ్-16 విమానాన్ని ఉపయోగించలేదని పాక్ ప్రకటించింది.భారత్ తమ ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసిందనడాన్ని కూడా ఖండించింది. అయితే, పాక్ ఆ విమానాలను వాడినట్టు భారత త్రివిధ దళాధిపతులు గురువారం నాటి సమావేశంలో ఆధారాలు సహా నిరూపించారు. పాకిస్తాన్ ఉపయోగించిన ఏఐఎం–120 క్షిపణి శకలాలను ఈ సమావేశంలో చూపించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పెద్ద ఎత్తున ఆయుధాలు విక్రయించే అమెరికా వాటి వినియోగానికి సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందాలను ఉల్లంఘించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తుంది.
ఒబామా సర్కార్ 2016లో పాకిస్తాన్కు ఎనిమిది ఎఫ్–16 విమానాలు విక్రయించాలని నిర్ణయించింది. అయితే, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వీటిని భారత్పైకి ప్రయోగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు