మసీదు వద్ద ఆగంతకుడి కాల్పులు: 15 మంది మృతి
వీకెండ్ సాయంత్రం ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా గుర్తుపట్టలేదని, కానీ అతను గోరోం వాసిగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
వాగాగా : విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఒక వ్యక్తి 15మంది నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. బుర్కినా ఫాసో దేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక సాయుధుడైన వ్యక్తి మార్కెట్లు రద్దీగా ఉండే సాయంత్రంపూట ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళితే, పశ్చిమ ఆఫ్రికాలో భూపరివేష్టిత దేశమైన బుర్కినా ఫాసో లో వీకెండ్ సాయంత్రం ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా గుర్తుపట్టలేదని, కానీ అతను గోరోం వాసిగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఈ కాల్పుల్లో 15మంది చనిపోయారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మసీదు ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పులకు అతడు తెగబడ్డాడు.
ప్రశాంతంగా ఉండే బుర్కినా ఫాసో సంవత్సర కాలంగా మత విద్వేషాలు, తీవ్రవాద దుశ్చర్యలవల్ల అట్టుడుకుతోంది. పక్కనున్న మాలి, నైజర్ ల నుంచి తీవ్రవాదం ఈ దేశంలోకి కూడా దిగుమతయ్యి ఇప్పుడు మహమ్మారిలా పట్టిపీడిస్తోంది.