ముంబయి దాడుల సూత్రధారిని పట్టిస్తే..అమెరికా భారీ రివార్డ్
ముంబయి దాడుల్లో కీలక సూత్రదారిని పట్టించినా.. వారి గురించి ఏదైనా కీలక సమాచారం తెలియజేసినవారికి 5మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది.
26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రదారిని పట్టించినా.. వారి గురించి ఏదైనా కీలక సమాచారం తెలియజేసినవారికి 5మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడికి పాల్పడిన, కుట్ర పన్నిన, సహాయ పడిన, దాడికి ప్రేరేపించిన వారి సమాచారం ఏదైనా తెలియజేస్తే.. వారికి 5మిలియన్ డాలర్లు (దాదాపు రూ.35కోట్లు) రివార్డుగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ముంబయిలో ఉగ్ర దాడి జరిగి పదేళ్లు అయిన సందర్భంగా అమెరికా ప్రకటన చేసింది. నాటి భయంకరమైన దాడిలో పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 166 మంది ప్రాణాలు తీశారు. మృతుల్లో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు.
ఇటీవల సింగపూర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్లు కలిసినప్పుడు ఈ విషయం గురించి పెన్స్ లేవనెత్తారు. ముంబయి ఉగ్రదాడి జరిగి పదేళ్లు అవుతున్నా దాడికి కుట్ర పన్నిన సూత్రధారులకు ఇప్పటివరకూ శిక్ష పడలేదని పెన్స్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా సోమవారం అమెరికాలోని స్టేట్ డిపార్ట్మెంట్ ఫర్ జస్టిస్(ఆర్జేఎఫ్) ఈ భారీ రివార్డును ప్రకటించింది. 2008 ముంబయి దాడులకు సంబంధించి తగిన న్యాయం జరిగేందుకు అమెరికా అంతర్జాతీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.